ఆదిలాబాద్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ) : తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచనతో బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతన నేతలు పేపర్ లీకేజీలకు పాల్పడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తో ఆడుకుంటారని మండిపడ్డారు.
గ్రూప్-1 పేపర్ లీకేజీ నిందితుడు రాజశేఖర్, పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసులో నిందితుడు ప్రశాంత్ ఇద్దరు బీజేపీ కార్యకర్తలేనని తెలిపారు. కమలం పార్టీ కేంద్ర నాయకత్వం డైరెక్షన్లో లీకేజీల వ్యవహారం జరుగుతుందన్నారు. బీజేపీ నాయకులు దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించాలని సూచించారు. ప్రభుత్వంపై నిందలు మోపడానికి బీజేపీ నాయకులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ కారణంగా తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, అనుకోని సంఘటనలు జరిగితే సంజయ్ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. పదో తరగతి పేపర్ లీకేజీ నిందితుడు బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి కిరణ్కుమార్, నాయకులు జీవన్రెడ్డి, బ్రహ్మనంద్, ఎలుక రాజు, సర్పంచ్లు సురేందర్, అబ్దుల్లా, జలంధర్ పాల్గొన్నారు.