భైంసా, అక్టోబర్ 30: బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో సోమవారం ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు. తన అనుచరగణంతో సుమారు 170 వాహనాల్లో 2 వేల మంది కార్యకర్తలతో ముథోల్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్కు బయలుదేరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదేండ్ల పాటు బీజేపీని నమ్ముకొని పనిస్తే తనకు పార్టీ అన్యాయం చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన నేతలకు ప్రాధాన్యమిచ్చిందన్నారు. కుభీర్, తానూర్, బాసర, లోకేశ్వరం పార్టీ అధ్యక్షులు సుధామ్ రాథోడ్, విష్ణువర్దన్ రెడ్డి, లస్మా రెడ్డి, గంగాధర్, భైంసా పట్టణ కమిటీ కార్యదర్శులు లక్ష్మణ్, ఎస్సీమోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు సతీశ్, ఓబీసీ మోర్చా ప్రతినిధి సంపత్ పటేల్, బీజేవైఎం ప్రతినిధి అక్షయ్ పటేల్, తదితరులున్నారు.
అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ అన్నారు. ఈ సందర్భంగా రమాదేవితో కలిసి ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. రమాదేవి బీఆర్ఎస్లోకి రావడంతో ముథోల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయ డం ఖాయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.