ఎమ్మార్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ మల్లేశ్ మాదిగ
బేల, జూన్ 15 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పార్లమెంటులో పెట్టకుండా మాదిగలకు నమ్మకద్రోహం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ ఆరెల్లి మల్లేశ్ మాదిగ దుయ్యబట్టారు. 10వ తేదీన ఇచ్చోడ నుంచి ప్రారంభమైన మాదిగల సంగ్రామ పాదయాత్ర బుధవారం ఆరో రోజు బేల మండల కేంద్రానికి చేరుకున్నది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. జూలై 3న హైదరాబాద్లో నిర్వహించే మాదిగల మహా గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న అన్ని కులాలకు అందాల్సిన రిజర్వేషన్ ఫలాలను కొన్ని కులాలు ఏకపక్షంగా దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటం చేస్తుంటే, దోపిడీకి అలవాటు పడ్డవారు అడ్డుకుంటున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ, దారుణంగా మోసం చేసిందన్నారు. నీతిమాలిన చర్యకు పరాకాష్ట అని విమర్శించారు. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మాదిగ ప్రజలంతా పెద్ద ఎత్తున సడక్ బంద్ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బరుకుంట సుభాష్, గైక్వాడ్ సూర్యకాంత్, గొటిముక్లె సుభాష్, ప్రసుల శ్రీకాంత్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.