ఎదులాపురం, మార్చి 31: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. దళితబంధు లబ్ధిదారులతో జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో కలెక్టర్ శుక్రవారం సమావేశమై మాట్లాడారు. లబ్ధిదారుడి ఇష్టానుసారం, అనుభవం మేరకు యూనిట్ను స్థాపించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి తొలి విడుతలో వందమంది చొప్పున ఆదిలాబాద్ జిల్లాలో 249 మందిని ఎంపిక చేసి యూనిట్లను ప్రారంభించినట్లు చెప్పారు. ఏర్పాటు చేసిన యూనిట్లతో అభ్యున్నతి సాధించాలన్నారు. ప్రభుత్వ ఆశయాన్ని సాధించాలని కోరారు. వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి ప్రతి ఒక్కరూ సూట్ వేసుకోవాలని సూచించారు. అంతకుముందు పలువురు లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. యూనిట్ నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను సంబంధిత అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు వారి పరిధిలోని దళితబంధు యూనిట్లను సందర్శించి వ్యాపార వృద్ధి, మార్కెటింగ్ తదితర సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, డీఎస్సీడీవో భగత్ సునీతాకుమారి, ఎల్డీఎం భాస్కర్ ప్రసాద్, పరిశ్రమల శాఖ జీఎం పద్మభూషణ్రాజు, డెయిరీ అభివృద్ధి ఉప సంచాలకుడు మధుసూదన్, ఆర్టీసీ ఆర్ఎం జానీ రెడ్డి, వ్యవసాయ, రవాణాశాఖ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
భవన నిర్మాణం పరిశీలన
జిల్లా కేంద్రంలోని జడ్పీ క్వార్టర్స్ సమీపంలో రూ.2 కోట్ల తో చేపట్టిన అంబేద్కర్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం పరిశీలించారు. మొదట భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను పీఆర్ ఈఈ మహావీర్ను అడిగి తెలుసుకున్నారు. పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఆయన వెంట పీఆర్ ఏఈ హరీశ్ ఉన్నారు.
ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభం
కళా రంగానికి విశిష్ట సేవలందిస్తున్న కళాకారులకు ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందనలు తెలిపారు. జిల్లాకేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ భవనంలో లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కింగ్స్ అండ్ కాటన్ సిటీ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నారపు నరేందర్ గీసిన చిత్రపటాలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశవిదేశాల్లో జిల్లా వాసి కీర్తి ప్రతిష్టలను ఇనుమడడింపజేస్తూ సుమారు 2వేల పెయింటింగ్లు అభినందనీయమన్నారు. ఒక ఆలోచనతో చిత్రాన్ని గీసి మరిన్ని మెరుగులు దిద్దుతూ పెద్ద ఎత్తున మన సంస్కృతి సంప్రదాయాలు, ప్రేమానురాగాలను,జీవితాలు, విభిన్న సన్ని వేశాలకు అనుగుణంగా చిత్రాలు వేయడం హర్షణీయమన్నారు. జిల్లాకు మంచి పేరు సాధించడానికి మరిన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్లో వివిధ రకాల బొమ్మలు తయారుచేస్తూ రవీంద్రశర్మ కళాశ్రమం స్థాపించారని, ప్రముఖ పారిశ్రామిక వేత్త బజరంగ్ అగర్వాల్ అన్నారు. అనంతరం నరేందర్ను సత్కరించారు. కార్యక్రమంలో దూరదర్శన్ కేంద్రం మాజీ ప్రోగ్రాం అధికారి సుమనాస్పతి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎస్ లక్ష్మారెడ్డి, పడగంటి కిష్టయ్య, లయన్క్లబ్ అధ్యక్షుడు ప్రకాశ్, డెయిరీ అభివృద్ధి ఉప సంచాలకుడు మధుసూదన్, లయన్స్క్లబ్ సభ్యులు రమాకాంత్, వెంకటరమణ, సురేఖ, బండారి దేవన్న ఉన్నారు.