భైంసా, డిసెంబర్ 26 : శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శమని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో అయోధ్య అక్షింతల కలశ శోభాయాత్రను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అయోధ్యలో శ్రీరాముడి భవ్య మందిరం సాకారం కావడం హిందువుల స్వాభిమానికి సంకేతమన్నారు. జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు జన సంపర్క్ అభియాన్ పేరిట ఇంటింటికీ అయోధ్య అక్షింతలు, కరపత్రాలు, చిత్రపటం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ పాల్గొన్నారు.