నార్నూర్, ఫిబ్రవరి 21 : ఉమ్మడి మండలంలో వచ్చే ఏడాది చేపట్టనున్న తొమ్మిదో విడుత హరితహారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వన నర్సరీల్లో మొక్కల పెంపకం పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. మండలంలోని ప్రతి పంచాయతీ పరిధిలో 10వేల మొక్కలు పెంచేలా ప్రణాళికలు రూపొందించారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని 48 జీపీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో భాగంగా 4.80 లక్షల మొక్కలు పెంచేందుకు కార్యాచరణ ప్రారంభించారు. నర్సరీ నిర్వహణ బాధ్యతను పంచాయతీలే చూసుకునేలా ఏర్పాటు చేశారు. దీంతో ఏ గ్రామానికి కావాల్సిన మొక్కలు అదే గ్రామంలోని నర్సరీలో పెంచుతున్నారు. పాత, కొత్త మొక్కలతో నాటేలా లక్ష్యం నిర్దేశించారు.
ఉమ్మడి మండలంలోని మొత్తం 48 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో బ్యాగ్ఫిల్లింగ్ పనులు పూర్తి చేశారు. పలు నర్సరీల్లో పండ్లు, అవెన్యూ, పూల తదితర మొక్కలకు చెందిన విత్తనాలను నాటి పెంచుతున్నారు. హరితహారానికి మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమానికి సంబంధించి మాన్కాపూర్ నర్సరీలో 10వేల మొక్కలు పెంచాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే బ్యాగులు కేటాయించారు. అందులో మట్టి నింపే పనులు పూర్తి చేశాం. పండ్లు, పూల మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలు పెంచుతున్నాం. హరితహారం ప్రారంభానికి ముందే వీటిని నాటేందుకు సిద్ధం చేస్తున్నాం. ప్రతిరోజూ మొక్కలు పెరిగేలా నీళ్లు పడుతున్నాం.
– మెస్రం దేవ్రావ్, నర్సరీ నిర్వాహకుడు, మాన్కాపూర్
ఉన్నతాధికారుల ఆదేశాలతో మండలంలో హరితహారానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టాం. అన్ని నర్సరీల్లో బ్యాగ్ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయి. పలు నర్సరీల్లో వివిధ రకాల మొక్కలు కూడా పెంచుతున్నారు. వారం రోజుల్లో విత్తనాలు నాటేందుకు కృషి చేస్తాం. హరితహారం ప్రారంభం రోజు నాటిని అన్ని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
– రాథోడ్ సురేందర్, ఈజీఎస్ ఏపీవో,నార్నూర్