ఎదులాపురం, డిసెంబర్ 18 : క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని గెలుపోటములు సహజమని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో సోమవారం నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లా స్థాయి పోలీసు క్రీడలను ఎస్పీ ప్రారంభించారు. జిల్లా స్థాయి క్రీడల్లో ఐదు బృందాలు ఏఆర్హెడ్క్వార్టర్స్, స్పెషల్ పార్టీ, క్యూఆర్టీ, ఆదిలాబాద్, ఉట్నూర్ సబ్ డివిజన్లు, హోంగార్డు టీం పాల్గొంటున్నాయి.
ముందుగా ఎస్పీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఐదు బృందాలచే పరేడ్ నిర్వహించి కమాండర్గా వ్యవహరిస్తున్న ఆర్ఐ నవీన్, ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించారు. అలాగే శాంతికపోతాలను, బెలూన్లను ఎగురవేసి క్రీడాకారులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులకు శారీరక దృఢత్వం చాలా ముఖ్యమైనదని దాన్ని కాపాడాలంటే క్రీడలతోని సాధ్యమవుతుందన్నారు.
జిల్లా స్థాయి క్రీడల్లో ఐదు బృందాలు వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ విభాగంలో 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెం, షాట్ఫుట్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ ఏఆర్హెడ్క్వార్టర్స్, ఉట్నూర్ సబ్ డివిజన్ మధ్య కొనసాగిన వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని వాలీబాల్ క్రీడను వీక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీ డీసీఆర్బీ సీహెచ్ శ్రీనివాస్జీ, సీఐలు ఏ అశోక్, కే నరేశ్ కుమార్ , ఈ భీమేశ్, ఆర్ఐ సీఐలు టీ మురళి, స్వామి, నవీన్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఆర్ఐ సిబ్బంది, సబ్ డివిజనల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.