ఎదులాపురం, ఆగస్టు 12 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే ఫ్రీడం ర్యాలీని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్హాల్లో శుక్రవారం వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పట్టణంలో ఉదయం 11 గంటలకు ఫ్రీడం ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. పట్టణానికి ఓ వైపు ఉన్న ప్రజలు కలెక్టర్ చౌక్ వద్దకు, మరో వైపు ఉన్న ప్రజలు ఎన్టీఆర్ చౌక్ వద్దకు ర్యాలీగా రావాలని సూచించారు.
అందరూ కలిసి స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బెలూన్లను ఎగురవేసి, ఐక్యతను చాటిచెప్పాలని సూచించారు. పట్టణ ప్రజలు, మహిళలు, విద్యార్థులు, అన్ని కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పొల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వీ ఉమేందర్, పట్టణ సీఐలు పీ సురేందర్, కే మల్లేశ్, బీ రఘుపతి, పోలీసు సిబ్బంది, పట్టణంలోని వార్డు కౌన్సిలర్లు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.