ఆదిలాబాద్ రిమ్స్ హాస్టల్లో బుధవారం అర్ధరాత్రి దుండగులు చొరబడి మెడికోలపై దాడికి పాల్పడ్డారు. పలువురు విద్యార్థులకు గాయాలు కాగా.. వారు గురువారం ఉదయం రిమ్స్ ప్రధాన గేటు, కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. రెండు గంటలపాటు నిరసనలతో రిమ్స్ అట్టుడుకగా.. అసిస్టెంట్ ఫ్రొఫెసర్ క్రాంతికుమార్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని విధులు, తరగతులు బహిష్కరించారు.
నిందితులకు శిక్షపడే వరకు ఊరుకునేది లేదని, డైరెక్టర్ను సస్పెండ్ చేయాలని, క్రాంతి కుమార్ను విధుల నుంచి తొలగించాని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బయటి వ్యక్తులు హాస్టల్ క్యాంపస్లోకి రాకుండా భద్రత పెంచాలని ధర్నా నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి నచ్చజెప్పినా వినకుండా కలెక్టర్ రావాలని పట్టుబట్టారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్రాజ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా.. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మెడికోలకు మద్దతు తెలిపారు.
– ఆదిలాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ రిమ్స్ హాస్టల్లో బుధవారం అర్ధరాత్రి వైద్య విద్యార్థులపై దుండగులు దాడి చేశారు. రిమ్స్లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న క్రాంతికుమార్.. వసీం, క్రాంతిలను కారులో తీసుకొచ్చి మెడికోలపై దాడికి పాల్పడగా పలువురికి గాయాలయ్యాయి. దీంతో రిమ్స్ ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు రిమ్స్కు చేరుకుని పలువురిని అరెస్ట్ చేశారు. దాడిని నిరసిస్తూ మెడికోలు ఉదయం భారీగా ఆందోళన చేపట్టారు.
విధులు, తరగతులు బహిష్కరించి కళాశాల ఎదుట బైఠాయించారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినం గా శిక్షించాలని, డైరెక్టర్ను సస్పెండ్ చేయాలని, క్రాంతి కుమార్ను విధుల నుంచి తొలగించాని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గాయపడిన మెడికో కవిరాజ్ ఫిర్యాదు మేరకు రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్, వసీం, ఇతరులపై కేసులు నమోదయ్యాయి. కాగా.. మెడికోల ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు బీజేపీ కార్యకర్త శివపై కేసు నమోదు చేశారు. కాగా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పాయల్ శంకర్కు శివ, మరో నాయకుడితో కలిసి అభినందనలు తెలిపిన పోస్టర్లు పట్టణంలో దర్శనమిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
రిమ్స్లో ఆందోళన అనంతరం మెడికోలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, తమపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న కలెక్టర్ కార్యాలయం ఎదుట వారితోపాటు ఆందోళనలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఇతర పార్టీల నాయకులు విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. రెండు గంటలపాటు విద్యార్థులు నిరసన చేపట్టారు. అధికారులు, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి వైద్య విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కలెక్టర్ రావాలని పట్టుపట్టారు.
కలెక్టర్ రాహుల్రాజ్ ఆందోళన జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని వైద్య విద్యార్థులతో మాట్లాడారు. మెడికోలు తమపై జరిగిన దాడి వివరాలను కలెక్టర్కు వివరించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా.. ఈ విషయమై దుండగులపై చర్యలు తీసుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్ కలెక్టర్ రాహుల్రాజుకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సంబంధించిన అదనపు కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ చేపడుతారని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. మెడికోలు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ హామీతో వైద్య విద్యార్థులు తమ ఆందోళన విరమించారు.
విద్యార్థులపై దాడి ఘటనలో విచారణ జరపడానికి వైద్యవిద్యా డైరెక్టర్ కే.రమేశ్రెడ్డి ఇద్దరు సభ్యుల కమిటీని నియమించారు. నిజామాబాద్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలో సైక్రాట్రీ విభాగం హెచ్వోడీ డాక్టర్ శివప్రసాద్, పల్మనాలజీ విభాగం హెచ్వోడీ డాక్టర్ వీవీ రావులు కమిటీలో ఉన్నారు. వీరు రిమ్స్ విద్యార్థులు, ప్రొఫెసర్లతో మాట్లాడి పూర్తి నివేదికను వైద్య విద్యా శాఖ డైరెక్టర్కు అందజేస్తారు.
మెడికోలపై దాడికి పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. డైరెక్టర్ను సస్పెండ్ చేయాలి. దాడికి పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్ను విధుల నుంచి తొలగించాలి. బయటి వ్యక్తులు హాస్టల్ క్యాంపస్లోకి రాకుండా భద్రత పెంచాలి. నిందితులపై చర్యలు తీసుకునేంత వరకు విధులు బహిష్కరించి ఆందోళన చేపడుతాం. –
భరత్, మెడికో, రిమ్స్
అర్ధరాత్రి రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్ కొంతమంది దుండగులను తీసుకొచ్చి విద్యార్థుపై దాడి చేయించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి.
– నవీన్, వైద్య విద్యార్థి, రిమ్స్
రిమ్స్ హాస్టల్లో మెడికోలపై దుండుగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. దాడికి పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన 12 మంది సీనియర్ వైద్యలతో కూడిన విచారణ బృందాన్ని ఏర్పాటు చేశామని, కమిటీ ఐదు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందజేస్తుందన్నారు. నివేదక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామని, భద్రత పెంచుతామని డైరెక్టర్ తెలిపారు.
– జైసింగ్ రాథోడ్, డైరెక్టర్, రిమ్స్