రక్షా బంధన్ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టే కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పార్టీ మహిళా విభాగాల ఆధ్వర్యంలో గురుకులాలు, కస్తూర్బాలతో పాటు ప్రధాన చౌరస్తాల్లో ముఖ్యమంత్రి చిత్రపటాలకు రాఖీలు కట్టి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దీవించారు. మహిళల ఉజ్వల భవిష్యత్కు అనేక పథకాలు అమలు చేస్తూ పెద్దన్నగా నిలుస్తున్నారని, ఆయన వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. పలుచోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, తదితర నాయకులు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు ఆయా చోట్ల జిల్లా ఉన్నతాధికారులకు మహిళా ఉద్యోగులు, స్థానిక మహిళలు రాఖీలు కట్టారు.
ఎదులాపురం/బోథ్/నిర్మల్ అర్బన్, ఆగస్టు 12: ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళాభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తూ పెద్దన్నగా నిలుస్తున్నారని, రక్షాబంధన్ సందర్భంగా ఆయన చిత్రపటాలకు రాఖీలు కట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు మహిళా గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూళ్లను సందర్శించి విద్యార్థునులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ మహిళా విభాగాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు కట్టి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దీవించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రీనగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఐకేపీ, డీఆర్డీఏ మహిళా ఉద్యోగులు, సిబ్బంది, బ్రహ్మ కుమారీలు మహిళా ప్రజాప్రతినిధులు, కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీలు కట్టారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మహిళల సమగ్ర అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాల, కేజీబీవీలలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న రాఖీ పండుగ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు. వారికి స్వీట్లు తినిపించారు. ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్ మహిళ కార్యకర్తలు, ఎమ్మెల్యే సోదరి, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బెహన్జీ రేవతి దీదీ ఎమ్మెల్యే జోగు రామన్నకు రాఖీ కట్టారు. బోథ్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన రాఖీ పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు. విద్యార్థినులు ఆయనకు రాఖీలు కట్టారు. బోథ్ మండల పరిషత్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల మహిళలు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీలు కట్టారు. నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీలో రక్షాబంధన్ వేడుకల్లో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఆయనకు రాఖీలు కట్టారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళా ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయినిలు, విద్యార్థినులు రాఖీ కట్టారు.
ప్రముఖులకు రాఖీలు..
జిల్లాలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి వారి తోబుట్టువులు, నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, పోలీసులు, మహిళా ఉద్యోగులు రాఖీలు కట్టారు. నిర్మల్ కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీకి డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎం శశికళ, మహిళా ఉద్యోగులు, ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయంలో పీవో వరుణ్రెడ్డికి ఉపాధ్యాయులు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాలులో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డికి వన్ టౌన్ ఏఎస్ఐ సవిత, మాజీ ఎంపీ నగేశ్కు మాజీ మున్సిపల్ చైర్మన్ మనీష, మహిళలు, అలాగే స్థానిక ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలకు శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు రాఖీలు కట్టారు.