నస్పూర్/ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 2 : ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు బీ. భారతి లక్పతి నాయక్ ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, బూత్ స్థాయి అధికారులు, బీఎల్వో సూపర్ వైజర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
6, 7, 8 ఫారాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తప్పుల్లేని 100 శాతం స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు. 18 ఏళ్లునిండిన వారితో పాటు అర్హత గల దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 6న పారామీటర్లు పరిశీలించి జాబితా రూపొందిస్తామని, 8న తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.
ఆసిఫాబాద్ కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు బూత్ స్థాయి అధికారులు, ప్రతినిధుల సహకారం తీసుకుంటామన్నారు. సమావేశం లో నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు ఆశీష్ సంగ్వాన్, హే మంత్ బోర్కడే, బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు రాహుల్, శ్యామలాదేవి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, బూత్స్థాయి అధికారులు పాల్గొన్నారు.