కడెం, అక్టోబర్ 17: అటవీ ప్రాంతంలో సరైన పనులు, వసతులు లేక ఇబ్బందులు పడ్డ గిరిజన బిడ్డలకు ఇక విముక్తి లభించనున్నది. ప్రస్తుతం ఈ ప్రాంతం 42వ టైగర్జోన్ (కవ్వాల్ అభయారణ్యం)గా ఏర్పాటు కావడంతో అడవిలో ఉంటున్న వారిని ఖాళీ చేయించేందుకు నిర్ణయించారు. నిర్మల్ జిల్లాలోని కడెం మండలంతోపాటు, మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని 23 గ్రామాలను అటవీ నుంచి ఖాళీ చేయించి, మైదాన ప్రాంతాలకు తరలించేందుకు గతంలో ఎంపిక చేశారు. కాగా, ఎన్నో ఏళ్లుగా అడవిని నమ్ముకొని ఉంటున్న గిరిజనులు ఈ ప్రాంతాలను ఖాళీ చేయడానికి మొదటగా ఆసక్తి చూపలేదు. కానీ.. ప్రభుత్వం ముందుకొచ్చి వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు వెళ్లడానికి అంగీకరించారు. వనాన్నే నమ్ముకొని అటవీ సంపద ద్వారా జీవనం సాగించిన అడవిబిడ్డలు అటవీ గ్రామాలను వదిలి మైదాన ప్రాంతాలకు రానున్నారు.
మొదటగా రెండు గ్రామాలకు పునరావాసం
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని రాంపూర్, మైసంపేట గ్రామాలు పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండడంతో, ముందుగా అక్కడి ప్రజలను తరలించాలని మొదటి విడుత కింద అటవీశాఖ అధికారులు ఎంపిక చేశారు. అయితే ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని రెండు గ్రామాలను కలిపి మొత్తం 142 కుటుంబాలు ఉండగా, వీరిలో 94 మందికి ఇండ్లు, మూడెకరాల వ్యవసాయ భూమితోపాటు, మౌళిక వసతుల కల్పనకు అంగీకరించారు. మిగిలిన 48 మంది రూ.15 లక్షలు తీసుకునేందుకు ఒప్పుకున్నారు. ఈ డబ్బులను వారంలోగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే వీరికి గ్రామాల్లో ఒక్కొక్కరికి సగటున రెండెకరాల సాగు భూమి ఉంది. కానీ.. అనువైన భూములు కాకపోవడంతో, యేటా పంటలు వేసినా దిగుబడి సరిగా వచ్చేది కాదు. దీనికి తోడు సాగు నీరు ఉండేది కాదు. అటవీ ప్రాంతం కావడంతో నేటికీ సరైన విద్యుత్ సౌకర్యం లేదు. అలాగే వేసిన పంటలు చేతికొచ్చే దశలో అటవీ జంతువులు, ధ్వంసం చేసేవి. పదేళ్ల క్రితమే టైగర్జోన్ ప్రస్తావన రావడంతో, ఈ ప్రాంతాలు ఖాళీ అవుతున్నాయనే నేపథ్యంలో గిరిజనులు పంటలు వేయడం పూర్తిగా మానేసి, అప్పటి నుంచి అటవీ సంపదపైనే ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. దీంతో ఇక్కడి కంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవించడం మంచిదని గిరిజనులు నిర్ణయించుకొని పునరావాసం కోసం ఎదురు చూశారు.
తడోబా మాదిరిగా..
మహారాష్ట్రలోని తడోబా వంటి ప్రాంతాల్లో గిరిజనులను మైదాన ప్రాంతాలకు తీసుకెళ్లి పునరావాసం కల్పించారు. ఇక్కడ కూడా అదే లక్ష్యంతో అప్పటి అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో గిరిజనులను అటవీ అధికారుల సహాయంతో మహారాష్ట్ర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడి పరిస్థితులు, పునరావాసం వంటి వివరాలను పూర్తిగా తెలుసుకొని వచ్చారు. అనంతరం గిరిజన గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి, వారికి అంగీకారం అయితేనే గ్రామాలను ఖాళీ చేయించాలని గిరిజనులతో సంప్రదింపులు జరిపారు. దీనికి అన్ని అటవీ గ్రామాల ప్రజలు అంగీకారం తెలుపడంతో తరలింపు కార్యక్రమాన్ని వేగవంతం చేశారు.
గిరిబిడ్డలకు ప్రభుత్వం అండ
గిరిజన గ్రామాల్లో పనులు లేక, కటిక ధరిద్రాన్ని ఎదుర్కొంటున్న గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఇప్పటివరకు జనావాసాలకు దూరంగా ఉన్న గిరిజనులకు ఇక ఆ బాధలు తొలగనున్నాయి. టైగర్జోన్ పరిధిలోకి వచ్చే గ్రామాల ప్రజలు అడవిని వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లి బతికేందుకు ప్రభుత్వం ఉపాధి చూపనుంది. నేరుగా జిల్లా కలెక్టర్ గ్రామసభ నిర్వహించి, వారికి వసతులు, వ్యవసాయ భూమి, డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు.
కంపార్ట్మెంట్ 542, 851లో పునరావాసం
రాంపూర్, మైసంపేట గ్రామాల గిరిజనులకు కడెం మండలంలోని కొత్తమద్దిపడగ, పెత్తార్పు గ్రామాల్లోని కంపార్ట్మెంట్ నంబర్ 851, 842 లో భూములను కేటాయించారు. కొత్తమద్దిపడగ గ్రామ సమీపంలో ఇండ్ల కోసం స్థలాలను కేటాయించి సర్వేలు పూర్తి చేశారు. అలాగే మండలంలోని పెత్తార్పు గ్రామ సమీపంలో వ్యవసాయ భూములకు స్థలాన్ని కేటాయించారు. ఇండ్ల స్థలాల కోసం 12 ఎకరాలు, వ్యవసాయ భూమి కోసం 207 ఎకరాలు కేటాయించారు. వారంలోగా ఇక్కడ పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇక్కడి నుంచి వెళ్లిపోతాం..
ఇక మా ఊరు మైసంపేట నుంచి వెళ్లిపోతాం. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పనులు దొరకడం లేదు. మా తాతలు, తండ్రులు చేసినట్లు మేము కూడా ఇక్కడ వ్యవసాయమే దిక్కుగా బతుకుతున్నం. వ్యవసాయం చేయడానికి ఇబ్బంది లేదు.. కానీ, ఇక్కడ ఆ పంటలను అటవీ జంతువులు దక్కనివ్వడం లేదు. బయట గ్రామాలకు వెళ్లి చూస్తే వాళ్ల బతుకులకు, మా బతుకులకు చాలా తేడా ఉంది. సర్కారోళ్లు చెప్పినట్లు మేం మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు ఒప్పుకున్నం.
– పెంద్రం శేఖర్, మైసంపేట.
పనుల్లేవ్.. పైసల్లేవ్..
మాది ఊరు జంగళ్ల ఉంటది. మాకేమైన రోగమొచ్చిన, నొప్పొచ్చినా కష్టమయ్యేది. పాణాలు పొవుడే అయ్యేది. మా ఊరి ఆడబిడ్డలు పురిటి నొప్పుల కోసం పడే ఇబ్బం దులు అంతా ఇంత కాదు. ఏళ్లుగా మా బతుకులు మారడం లేదు. సర్కారోళ్లు మమ్మల్ని తీసుకెళ్తే మేము ఇక్కడి నుంచి వెళ్లిపోతాం. రాష్ట్ర సర్కారు మాకు భరోసానిచ్చింది. అన్ని సౌకర్యాలు కల్పిస్తమని చెప్పింది. ఇలా చేస్తే వేరే ఊళ్లకు పోయి బతికేందుకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
-హన్క సొంబాయి, మైసంపేట.