ఆదిలాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ యేడాది పత్తి కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ యేడాది 3.52 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట వేయగా.. 21 లక్షల క్వింటాళ్ల దిగుబడి మార్కెట్కు వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేశారు. పత్తి కొనుగోళ్లపై రేపు(శుక్రవారం) కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.6,380 మద్దతు ధర ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్ల ధర అధికంగా ఉండడంతో ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే అధికంగా చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి పంటను సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా ఈ పంట సాగుకు అనుకూలమైన నేలలున్నాయి. నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండడంతో ఎన్నో ఏళ్లుగా రైతులు తెల్లబంగారాన్ని పండిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో జిల్లా వ్యాప్తంగా ఏటా పత్తిసాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వాతావరణ పరిస్థితులు సైతం పత్తి సాగుకు అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో ఏటా వానకాలంలో సగటు 1200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతున్నది. నల్ల రేగడి భూముల్లో నీటిని నిల్వ చేసుకునే గుణం ఉండడంతో 20 రోజుల వరకు వానలు పడకపోయినా పంటకు ఎలాంటి ప్రమాదం ఉండదు. క్రమంగా వానలు పడితే చెల్క భూముల్లో సైతం పంట ఏపుగా పెరుగుతుంది.ఈ ఏడాది జిల్లాలో 3.52 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేశారు. జూన్ మొదటి వారంలో వేసిన పంట దిగుబడులు అక్టోబర్ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయి. జనవరి చివరి వారం వరకు రైతులు పంటను తీస్తారు.
కొనుగోళ్లకు ఏర్పాట్లు..
జిల్లాలో ఈ ఏడాది 3.52 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేశారు. జూలైలో కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని భూముల్లో వేసిన పత్తి పంటను నష్టపోయారు. ప్రస్తుతం పత్తి దూది విచ్చుకుంటున్నది. ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల వరకు పంట దిగుబడులు వచ్చే అవకాశాలున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 21 లక్షల క్వింటాళ్ల పంట మార్కెట్కు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాల్కు రూ.6380 మద్దతు ధర ప్రకటించింది. పంట దిగుబడులు త్వరలో ప్రారంభంకానుండడంతో అధికారులు జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ప్రణాళికలు తయారు చేశారు.
శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమావేశం నిర్వహించనున్నారు. వ్యవసాయ, సీసీఐ, మార్కెటింగ్, రెవెన్యూ, తూనికలు కొలతలు, విద్యుత్, ఫైర్, పోలీస్, ఇతర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. జిల్లాలోని తొమ్మది మార్కెట్యార్డుల్లో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గతేడాది జిల్లాలో పత్తి క్వింటాల్కు రూ.12 వేలు చెల్లించి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం వరంగల్లో పత్తి క్వింటాల్కు రూ.8400 ధర పలుకుతున్నది. ఈ ఏడాది సైతం రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ రేటు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ప్రైవేట్ వ్యాపారులు పంటను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే అవకాశం ఉన్నది.
ఏర్పాట్లు చేస్తున్నాం..
జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సన్నద్ధమవుతున్నాం. వివిధశాఖల అధికారులతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం సమావేశం నిర్వహిస్తారు. జిల్లాలో ఈ ఏడాది 3.52 లక్షల ఎకరాల్లో రైతులు పంటను సాగు చేయగా, 21 లక్షల క్వింటాళ్ల పంట అమ్మకానికి వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా పంటను కొనుగోలు చేస్తాం.
– శ్రీనివాస్,జిల్లా మార్కెటింగ్ అధికారి, ఆదిలాబాద్