బోథ్/నేరడిగొండ, సెప్టెంబర్ 28: బోథ్, నేరడిగొండ మండలాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి వాగులు ఉప్పొంగాయి. బోథ్ మండలం ధన్నూర్ (బీ) వాగు వంతెనపై నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి. దీంతో నాలుగు గ్రామాల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు, కూలీలు పొలం పనులకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బోథ్ సమీపంలో కండ్రివాగు వంతెనపై నుంచి వరద ప్రవాహంతో పద్నాలుగుకు పైగా గ్రామాల ప్రజలు అవస్థలు పడ్డారు. మర్లపెల్లి, నిగిని, పట్నాపూర్, కంటెంగాం, బాబెర, నక్కలవాడ తదితర గ్రామాల ప్రజలు వాగు దాటలేక పోయారు. భారీ వర్షం కారణంగా కోత దశకు వచ్చిన సోయాబీన్ పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పత్తి పంటలో వర్షపు నీరు నిలిచి పూత, పిందె రాలిపోతున్నదని ఆవేదన చెందుతున్నారు. నేరడిగొండ మండలంలోని తేజాపూర్, కుమారి, వడూర్, వాంకిడి, నేరడిగొండ, బుద్దికొండ, వాగ్దారి, కొర్టికల్, తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో తేజాపూర్ వాగు ఉప్పొంగింది. ఈ వర్షాలతో పత్తి, సోయ పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.