సమైక్య రాష్ట్రంలో పాలకుల వివక్ష కారణంగా గ్రామాలు అభివృద్ధికి దూరంగా, సమస్యలతో కొట్టుమిట్టాడేవి. ఉపాధి కరువై గిరిజన యువత అజ్ఞాతం బాట పట్టేది. నిత్యం మారుమూల పల్లెల్లో ఇటు మావోయిస్టులు, అటు పోలీసుల బూట్ల చప్పుళ్లతో కంటిమీద కునుకు లేకుండా పోయేది. ఈ క్రమంలో స్వరాష్ట్రం ఏర్పడడంతో, సీఎం కేసీఆర్ సారథ్యంలో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తు న్నాయి. వివిధ సంక్షేమ కార్యక్రమాలతో రూపురేఖలు మార్చుకొని కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. తండాలు, గూడేలు పంచాయతీలుగా మారగా, పాలన మరింత చేరువైంది. ఈ నేపథ్యంలో యువతకు స్థానికంగానే ఉపాధి దొరుకుతుండగా, ప్రభుత్వం, పోలీసులు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలతో అజ్ఞాతానికి వెనుకడుగేస్తున్నది.
-నిర్మల్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ)
నిర్మల్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు మారుమూల పల్లెల ప్రగతికి సోపానమవుతున్నా యి. అప్పటి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని వందలాది గ్రామాలు అభివృద్ధికి నోచుకోక తీవ్ర వివక్షకు గురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాటి ప్రభుత్వాల వైఫల్యంతో గిరిజన యువత మావోయిజం వైపు అడుగులేసింది. చాలామంది యువకులు అప్పటి పీపుల్స్ వార్ పార్టీ, ప్రస్తుత మావోయిస్టు పార్టీలో చేరి అజ్ఞాత జీవితం గడిపారు. సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, భవిష్యత్కు భరోసా దొరకక పోవడంతో పాటు కుటుంబాలకు ఆసరాగా నిలువలేక పోతున్నామన్న నిరాశతో అప్పట్లో అడవి బాట పట్టిన వారు ఎంతో మంది ఉన్నారు.
చాలా మంది యువకులు మావోయిస్టు పార్టీలో చేరి ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఎన్నో ఉన్నాయి. అప్పట్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు సామాజిక సమస్యగా మారాయి. ప్రతిరోజూ మారుమూల పల్లెల్లో ఇటు నక్సలైట్లు, అటు పోలీసుల బూట్ల చప్పుళ్లతో పల్లెలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మొదలైన నాటి నుంచి గిరిజన యువత చురుకుగా పాల్గొనడంతో పాటు క్రియాశీలక పాత్ర పోషించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మారుమూల గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చారు. మావోయిస్టు ఉద్యమంలో ఉంటూ ప్రాణాలు కోల్పోతున్న యువకుల కుటుంబాలు అనాథలుగా మారుతున్న సంఘటనలకు సీఎం చలించిపోయారు.
పల్లెల్లో నెలకొన్న సామాజిక సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా యువతను సన్మార్గంలో నడిపించేందుకు గాను వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. అలాగే సంక్షేమ, అభివృద్ధి పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా పల్లెలకు మండల కేంద్రాలు, సమీప పట్టణాలతో కనెక్టివిటీ చేసేందుకు రూ. కోట్లాది నిధులు వెచ్చించి అవసరమైన రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టింది. అలాగే గ్రామాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన తాగునీరు మొదలగు సదుపాయాలను కల్పించడంతో నేడు మారుమూల పల్లెలు సైతం ఎంతో అభివృద్ధి చెందాయి. గిరిజన యువతకు ఉద్యోగాలకోసం అవసరమైన పోటీపరీక్షలకు ఉచిత శిక్షణనివ్వడం, అలాగే వరుస నోటిఫికేషన్లు జారీ చేయడం… అన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యం కల్పించడం లాంటి చర్యలతో పల్లెలు, గిరిజన తండాలు, గూడెంల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి పకడ్బందీ చర్యలతో అప్పట్లో అజ్ఞాతం వైపు నడిచిన గ్రామీణ యువత నేడు క్రమంగా జనజీవనానికి చేరువ అవడమే కాకుండా ప్రస్తుత తెలంగాణ పాలనలో భాగస్వాములవుతున్నది.
నిర్వీర్యమైన మావోయిస్టు ఉద్యమం..
కాగా మొదటి నుంచి నక్సలైట్ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆ ఉద్యమాన్ని వెనుకడుగు వేయిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పల్లెల్లో ప్రతిరోజూ ఇటు నక్సలైట్లు అటు పోలీసుల ప్రతీకార చర్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా ప్రస్తుతం పల్లెలన్నీ ప్రశాంతంగా మారాయి. దాదాపు 10 ఏళ్ల నుంచి ఎక్కడా కూడా మావోయిస్టు కార్యకలాపాలు కనిపించడం లేదు. యువకులు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనాలు పొందుతున్నారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గిరిజన తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో స్థానిక పరిపాలనలో కూడా వారు భాగస్వాములవుతున్నారు.
మళ్లీ కదలికలపై అప్రమత్తమైన పోలీసులు..
కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు రాష్ర్టాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో పోలీసు నిర్బంధం పెరిగిన నేపథ్యంలో ఆయా రాష్ర్టాల నుంచి మావోయిస్టులు జిల్లాలోకి చొరబడి ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కమ్యూనిటీ పోలీసింగ్ కారణంగా ప్రతీ మారుమూల పల్లెతో పోలీసు శాఖకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. గతంలో మాదిరి కాకుండా పల్లె ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల సమాచారంపై పోలీసులు అప్రమత్తమవడమే కాకుండా వారి కదలికలను తెలుసుకునేందుకు అవసరమైన నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. మావోయిస్టులు గతంలో మాదిరిగా ఆలీవ్ గ్రీన్ దుస్తుల్లో కాకుండా సివిల్ డ్రెస్లతో సంచరిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్నారు. దీంతో పోలీసులు గ్రామాల్లో ప్రచారం చేస్తూ అపరిచిత వ్యక్తులు, సంఘ విద్రోహకర శక్తులు సంచరిస్తే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. దీంతోపాటు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల ఫొటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. మావోయిస్టులకు సహకరిస్తే చట్టపరమైన చర్యలుంటాయని ప్రచారం చేస్తూనే ప్రజల సహకారాన్ని కోరుతున్నారు.
తండాలు, గూడెంలు అభివృద్ధి చెందాయి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజన తండాలు, గూడెంలు ఎంతో అభివృద్ధి చెందాయి. అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మా గ్రామానికి నడిచి వెళ్లేందుకు కూడా సరైన దారి లేకుండే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీటీ రోడ్డు వేశారు. ఇప్పుడు గ్రామంలో తాగునీరు, కరెంటు, ఇతర అన్ని సదుపాయాలు ఉన్నయ్. మా తండాలు కూడా పంచాయ తీలు అయినయ్. మా ఊరి పిల్లలు మంచిగ సదువుకొని ఉద్యోగాలు చేస్తున్నరు. గతంలో నక్సలైట్ల భయంతో బిక్కు బిక్కుమంటూ బతికే వాళ్లం. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నం. ఇదంతా సీఎం కేసీఆర్ సారు దయ వల్లనే.
-శ్యాంరావు, సర్పంచ్, జంగుగూడ, పెంబి మండలం
ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి…
బలహీన వర్గాలు, ఆదివాసీ ప్రజల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకా లను అమలు చేస్తున్నది. గిరిజన గూడేలు, తండాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గిరిజనుల జీవన ప్రమాణాలు గతంతో పోల్చి తే ఇప్పుడు చాలా వరకు మెరుగు పడ్డాయి. ఇలాంటి తరుణంలో మావోయిస్టుల విప్లవ రాజకీయాలకు, హింసా పూరిత కార్యక్రమా లకు జిల్లాలో తావులేదు. గతంలో ఘటనలను గుర్తుకు తెచ్చుకొని ఆదిలోనే మావోయిస్టుల ఆగడాలకు, వారి ఉనికికి అడ్డుకట్ట వేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. యువత మావోయిజం వైపు ఆకర్షితులు కాకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్య, హాస్టల్ వసతులను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందాలి.
-సీహెచ్ ప్రవీణ్కుమార్, ఎస్పీ, నిర్మల్ జిల్లా