జైనథ్, సెప్టెంబర్ 19 : రాష్ట్ర మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి జోగు భోజమ్మ(98) సోమవారం ఉదయం స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు జోగు రామన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, డీఎస్పీ ఉమేందర్, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.. స్వగ్రామం దీపాయి గూడలో జోగు భోజమ్మ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. జోగు రామన్న తండ్రి ఆశన్న 2006లో మరణించారు. వీరు ముగ్గురు అన్నదమ్ములు, సోదరి. రామన్నకు పోతారెడ్డి అన్నయ్య కాగా, వెంకన్న తమ్ముడు. సోదరి పెంటక్క.
అశేష జనవాహిని మధ్య అంత్యక్రియలు..
జోగు భోజమ్మ మరణ వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివచ్చి వచ్చారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేల సంఖ్యలో ప్రజానీకం మధ్య భోజమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమ యాత్రకు అధికార పార్టీ నాయకులతో పాటు, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. అంతియ యాత్రలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని, జోగు రామన్నను పరామర్శించారు.