మంచిర్యాల. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా కళాకారులు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతమ య్యాయని ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్రావు, కలెక్టర్ భారతీ హోళికేరి, ఆసిఫాబాద్లో కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 18: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి జిల్లా వ్యాప్తంగా 82 మంది స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. అనంతరం జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. 18 కళా బృందాలు చేసిన నృత్యాలు, కళారూపాలు, నాటికలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన ప్రగతి సాధించి దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు.
పేద, బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మనమంతా మద్దతుగా నిలవాలన్నారు. అనంతరం కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ దేశ సమైక్యతను, సమగ్రతను చాటేలా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలున్నాయని అభినందించారు. స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను సన్మానించుకోవడం ఆనందదాయకంగా ఉందని పేర్కొన్నారు.
అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గౌతమి, డీఈవో వెంకటేశ్వర్లు, డీవైఎస్వో శ్రీధర్రెడ్డి, జడ్పీ సీఈవో నరేందర్, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, మున్సిపల్ వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, ఆర్డీవో వేణు, తహసీల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్,సెప్టెంబర్18 : సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన విధానాన్ని కళాకారులు గుర్తు చేశారని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో నిర్వహించారు. కలెక్టర్ రాహుల్రాజ్, ఐడీటీఏ పీవోత వరుణ్రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్బాజ్పాయితో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1948లో హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైందనీ, 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ప్రభుత్వం నిర్వహించిందని తెలిపారు.
ఈ వేడుకలను జిల్లా అధికారులు, పజా ప్రతినిధులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కళలను ప్రజల ముందుకు తీసుకురావడంతో పాటు వివిధ రంగాల కళాకారులను ప్రోత్సహిస్తూ, జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా ప్రదర్శనలు ఏర్పాటు చేసిందని చెప్పారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో పాటు కవులు, రచయితలు,జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం కళాకారులు, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కదం సురేశ్, డీఎస్పీ శ్రీనివాస్, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, డీఈవో అశోక్, డీడీ మణెమ్మ , పట్టణ ప్రజలు, అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.