ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు అర్థవంతమైన బోధన అందించి, వారి అభ్యసనా సామర్థ్యాలు పెంచే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. ఈ మేరకు కరోనా కాలంలో ప్రత్యక్షంగా చదువుకు దూరమైన పిల్లలు తెలుగు, ఆంగ్లం, గణితంలో వెనుకబడ్డారని గుర్తించి ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. పంద్రాగస్టు నుంచి దీనిని ప్రారంభించనుండగా, విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. 28 వారాల పాటు అమలు చేయనుండగా, విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ మంచిర్యాల అర్బన్, ఆగస్టు 3 : ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు తెలుగు,ఆంగ్లము, లెక్కల్లో వెనుకబడి పోతున్నారని ఓ సర్వేలో తేలింది. ఈ విషయాన్ని ఎన్ఏఎస్ 2021 ఫలితాలు కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థుల అభ్యసనా సామార్థ్యాలు పెంచడమే లక్ష్యంగా 140 రోజుల (28 వారాల) ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సంబంధిత శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
అభ్యసనా సామర్థ్యాల పెంపే లక్ష్యంగా..
విద్యార్థులలో కనీస అభ్యసనా సామర్థ్యాలు పెంపే లక్ష్యంగా విద్యాశాఖ ఈ ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2017లో త్రీఆర్స్, 2018లో ఏబీసీ పేరుతో విద్యా సామర్థ్యాల పెంపునకు కార్యక్రమలు అమలు చేసింది. తెలుగులో చదవడం, రాయడం నేర్పేవారు. బేస్లైన్ టెస్టు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిలో సామర్థ్యాలు పెంపొందించేవారు. రెండేళ్లుగా కరోనా ప్రభావం వల్ల విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ ప్రైమరీ విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నది. విద్యార్థులు ధారళంగా చదవడం, రాయడం, అక్షరాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నది.
ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు..
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమం అమలు చేస్తారు. దీనికి తగిన ప్రణాళికలను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వారంలో ఐదు రోజుల పాటు పాఠాలు బోధించి, ఒక రోజు పరీక్షలు నిర్వహిస్తారు. కాగా ఎస్ఎంసీ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలను కార్యక్రమంలో భాగస్వాములను చేస్తారు. పాఠశాల స్థాయిలో హెచ్ఎం, సముదాయాల పరిధిలో కాంప్లెక్స్ హెచ్ఎం, మండల స్థాయిలో ఎంఈవోలు నోడల్ అధికారులుగా ఉండి కార్యక్రమ అమలుకు కృషి చేయనున్నారు. అలాగే డీఈవో, సెక్టోరల్ అధికారులు, ఎస్సీఈఆర్టీ అధికారులతో మానిటరింగ్ బృందాల పర్యవేక్షణ ఉంటుంది.
ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ
తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలోని 8మంది సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)లు రిసోర్స్ పర్సన్లుగా రాష్ట్ర స్థాయిలో శిక్షణ తీసుకున్నారు. ఐదుగురు కో ఆర్డినేటర్లు శిక్షణ పొందారు. జిల్లా స్థాయిలో మండలానికి నలుగురు రిసోర్స్ పర్సన్లకు మూడు రోజుల శిక్షణ ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలోని 510 ప్రాథమిక, 96 ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1120 మంది ఎస్జీటీలకు రెండు విడుత ల్లో మండల స్థాయిలో శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ ఆగస్టు ఆరో తేదీ నాటికి పూర్తి కానున్నది.
పంద్రాగస్టు నుంచి…
విద్యా ప్రమాణాల పెంపు, గుణాత్మకమైన మార్పుతో పాటు కనీస సామర్థ్యాలు సాధించేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నది. ఇందుకోసం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒకటో తరగతి విద్యార్థులు నిమిషానికి 20 పదాలు, రెండో తరగతి విద్యార్థులు 25 పదాలు, మూడో తరగతి వారు 30 పదాలు, నాలుగో తరగతి వారు 40 పదాలు, ఐదో తరగతి వారు 50 పదాలు ధారాళంగా చదవగలగాలి. 3, 4, 5 తరగతి విద్యార్థులు ఇచ్చిన పేరాను చదివి అర్థం చేసుకోగలగాలి. నాలుగు నుంచి ఐదు వ్యాక్యాలతో కూడిన పేరాలు రాయగలగాలి. అప్పుడే సామర్థ్యాలు వచ్చినట్లు లెక్క. ఈ దిశగా తొలిమెట్టు కార్యక్రమం కొనసాగనున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
జిల్లాలో తొలిమెట్టు కార్యక్రమం అమలు కోసం ప్రత్యేకంగా నలుగురు రిసోర్సు పర్సన్లు రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందారు. వీరు జిల్లాలో ఎంపిక చేసిన 54 మంది రిసోర్స్ పర్సన్లకు, 1280 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఆగస్టు 11 వరకు శిక్షణ పూర్తికానున్నది. ఆగస్టు 15న పాఠశాలల్లో ప్రతిజ చేయించి 16వ తేదీ నుంచి పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలో ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న 30,290 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం కలుగనుంది.
సామర్థ్యాలు పెరుగుతాయి
‘తొలిమెట్టు’తో విద్యార్థుల సామర్థ్యాలు పెరుగుతాయి. చదవడం, రాయడం, ఒత్తులు, గుణింతాలవంటివి వస్తే ఉన్నత తరగతుల్లో విద్యార్థి మంచి ఫలితాలు సాధిస్తాడు. ఇందుకోసం జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. మండల స్థాయిలో ఉపాధ్యాయులకు ఈ నెల ఆరో తేదీ వరకు విడుతల వారీగా శిక్షణ ఇస్తున్నాం.
– ఎస్ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి, మంచిర్యాల