హాజీపూర్, జూలై 23 : ఎల్ంలపల్లి ప్రాజెక్టులో ఔత్సాహిక మత్స్యకారులు నిర్వహిస్తున్న కేజీ కల్చర్ యూనిట్ల నిర్వాహకులను ఆదుకోవాలని తెలంగాణ ఫిషరీస్ సోసైటీ వ్యవస్థాక అధ్యక్షుడు, కేజీ కల్చర్ నిర్వాహకుడు రవీందర్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు ముల్కపల్లి వెంకటేశ్వర్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మత్స్యశాఖ కార్యదర్శి అనిల్ సిన్హాకు శనివారం హైదరాబాద్లో వినతి పత్రం అందజేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రభుత్వ సహకారంతో నాలుగేండ్ల క్రితం ఎనిమిది కేజీ కల్చర్ యూనిట్లను ఏర్పాటు చేశారని, జూలై 13న అనూహ్యంగా వచ్చిన భారీ వరదలతో అవి పూర్తిగా కొట్టుకపోయాయన్నారు. కేజీ కల్చర్ యూనిట్లతో పాటు సుమారు రూ. కోటి విలువ చేసే వంద టన్నుల చేపలు, నాలుగు మోటార్లు, పది టన్నుల నిల్వ చేసిన దాన, ప్లోటింగ్ హౌస్ (నీటిపై తేలియాడే ఇల్లు) తదితర విలువైన సామాగ్రి పూర్తిగా కొట్టుకపోయి అపార నష్టం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వం అందించిన సహకారంతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏర్పాటు చేసిన కేజ్కల్చర్ కొట్టుక పోవడం వలన స్థానిక మత్స్యకారుల కుటుంబాలు, యువకులు ఉపాధి కోల్పోయారన్నారు. ఎనిమిది కేజీ కల్చర్ యూనిట్లకు చెందిన 80 పంజరాలు కొట్టుక పోవడంతో రూ. 4 కోట్ల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా భారీ నష్టాన్ని ఎదురుక్కోవడం వల్ల భవిష్యత్లో ఇలాంటి యూనిట్లను ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహిక మత్స్యకారులకు ఆశని పాతంగా మారిందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ను 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయగా, రెండుసార్లు మాత్రమే పాక్షికంగా చేపలను ఉత్పత్తి చేసామని, ఈ సారి పూర్తి స్థాయిలో చేపల ఉత్పత్తి చేయగలిగామన్నారు. మరో రెండు నెలలో చేపలు చేతికి వస్తాయనగా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో మత్స్యశాఖ, ముదిరాజ్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.