బోథ్, జూలై 3 : కాలం అనుకూలిస్తుండడంతో పంటలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. విత్తనాలు మొలకెత్తే దశ నుంచి వర్షాలు అనువైన సమయంలో కురుస్తుండడంతో మొలకలు ఎదుగుతున్నాయి. బోథ్ మండలంలో వానకాలం కింద సాగు చేస్తున్న పత్తి, సోయా, కంది, మక్క, జొన్న పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. 45,360 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. 28,159 ఎకరాల్లో పత్తి, 12,520 ఎకరాల్లో సోయా, 2,750 ఎకరాల్లో కందులు, 18 ఎకరాల్లో మినుములు, 20 ఎకరాల్లో పెసర, 40 ఎకరాల్లో మక్క, 15 ఎకరాల్లో వరి, మరో 120 ఎకరాల్లో జొన్న, ఇతర పంటలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. పత్తి పంట కాలం 25 రోజులు పూర్తవడంతో అన్నదాతలు రసాయన ఎరువులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. పత్తి సాల్లలో దౌరలు కొడుతూ, కలుపు మొక్కలు తొలగించి డీఏపీ, యూరియా ఎరువులు వేస్తున్నారు. సోయా పంట కాలం సైతం 20 రోజులు కావస్తుడండంతో కలుపు మొక్కల నివారణకు గడ్డి మందులు స్ప్రే చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ అవసరం మేరకే ఎరువులు, పురుగులు, గడ్డి మందులు వాడుతున్నారు. విత్తనాలు వేయడంతో పాటు మొలకెత్తే దశలో కాలం అనుకూలంగా ఉంటే పంటలు బాగా పండుతాయనే నమ్మకంతో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కాలం ఇలాగే ఉంటే పంటల్లో మంచి దిగుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
విత్తనాలు బాగానే మొలకెత్తాయి…
పత్తి, సోయా పంటల విత్తనాలు బాగానే మొలకెత్తాయి. వర్షాలు అనుకూలంగా ఉండడంతో ఏపుగా పెరుగుతున్నాయి. తొమ్మిది ఎకరాల్లో పత్తి, ఐదెకరాల్లో సోయా సాగు చేస్తున్నాను. ప్రస్తుతానికైతే పంటలు బాగానే ఉన్నాయి. పత్తికి ఎరువులు వేయడం, గడ్డి మందులు పిచికారీ చేయడం వంటి పనులు చేస్తున్నాం. -మడావి లక్ష్మణ్, రైతు, అందూర్