ఆదిలాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి..’ ఇది స్వామి వివేకానంద చెప్పిన మాట! లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తే.. విజయం మీ సొంతమవుతుంది! ఎన్నాళ్లుగానో ఉద్యోగార్థులు ఎదురు చూస్తున్న సర్కారీ కొలువుల మేళా మొదలైంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 16,614 పోలీస్, 503 గ్రూప్-1, 677 ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ శాఖల్లో పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు రాగా, అభ్యర్థులు కష్టపడితే కొలువు సులువు కానున్నది. కొత్త జోనల్ వ్యవస్థతో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉద్యోగాలు సాధించేందుకు అధిక అవకాశమున్నది. ఒత్తిడి, భయం, అపోహలు వీడి పక్కా ప్లానింగ్ ప్రకారం ప్రిపేరైతే కల సాకారమవుతుంది. దీనికితోడు అవగాహన సదస్సులు కూడా కీలకమేనని నిపుణులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 పైచిలుకు ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆయా ప్రభుత్వ శాఖల్లో కొలువుల భర్తీకి కసరత్తు మొదలు పెట్టగా, రాష్ట్ర సర్కారు భారీ ఉద్యోగమేళాను ప్రారంభించింది. ఇప్పటికే పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో 16,614 పోస్టులు, 503 గ్రూప్-1, 677 ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరంపర ఇంకా కొనసాగనుండగా, మున్ముందు వేలాది పోస్టుల భర్తీ సర్కారు కసరత్తు తీసుకుంటున్నది. తెలంగాణ సర్కారు దేశ చరిత్రలోనే అతి పెద్ద నోటిఫికేషన్లను విడుదల చేసిందని, యువతకు ఇది సువర్ణావకాశమని నిపుణులు చెబుతున్నారు. సీఎం ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం నియామకాలు చేపట్టనుండగా, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయంటున్నారు. అయితే, ఈ కొలువుల కల సాకారం కావాలంటే సమయాన్ని వృథా చేయకుండా.. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్నారు. అనుకున్న లక్ష్యం కోసం ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే విజయం మీ దరిచేరుతుందని భరోసా ఇస్తున్నారు. ఇంత మంచి అవకాశం మళ్లీ రాదని సూచిస్తున్నారు.
కష్టపడితే ఉద్యోగం లభిస్తుంది..
మాది ఉట్నూర్ మండలం ఉట్నూర్ ఎక్స్రోడ్. నేను బీటెక్ చదువుకున్నా. ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుని పోలీసు ఉద్యోగం సాధించా. ప్రస్తుతం ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో నిరుద్యోగులు కష్టపడి చదివితే ఉద్యోగం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలి. కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీలు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి. వివిధ పోటీ పరీక్షల పుస్తకాలు చదవాలి. అవగాహన సదస్సులకు హాజరైతే పరీక్షలు ఎలా రాయాలనే విషయాలతోపాటు ముఖ్య అంశాలపై పట్టుసాధించవచ్చు.
– భగీరథ నాయక్, కానిస్టేబుల్, టీఎస్ఎస్పీ రెండో బెటాలియన్.
ఉద్యోగం తప్పకుండా సాధిస్తా..
నేను బీసీ స్టడీ సర్కిల్లో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నా. ఇక్కడ శిక్షణ బాగా ఉంది. పలు అంశాలను ఫ్యాకల్టీలు చాలా బాగా చెబుతున్నారు. పోటీ పరీక్షలు రాయడానికి ఇక్కడ నేర్చుకున్న అంశాలు ఉపయోగపడుతాయి. స్టడీ మెటీరియల్ ఇవ్వడంతోపాటు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశారు. కోచింగ్తో పాటు అవగాహన సదస్సులు ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతాయి. నాకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది.
– శీతల్, కానిస్టేబుల్ అభ్యర్థి, ఇచ్చోడ, ఆదిలాబాద్
ఉద్యోగాలు సాధించడానికి మంచి అవకాశం
ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ఉద్యోగాలను నోటిఫికేషన్లు జారీ చేసింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టడం నిరుద్యోగ యువతీ,యువకులకు మంచి అవకాశం. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను బీటెక్ పూర్తి చేసి గ్రూప్స్నకు ప్రిపేర్ అవుతున్నా. ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకుంటున్నా. ఉద్యోగ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పక్కా ప్రణాళికతో చదువుకుంటే ఉద్యోగాలు సాధించవచ్చు. అవగాహన సదస్సుల ద్వారా నిరుద్యోగులకు పోటీ పరీక్షల ఎలా రాయాలి, ఇతర విషయాలపై అవగాహన కలుగుతుంది. – బి.రవికుమార్, రామాయి, ఆదిలాబాద్ రూరల్ మండలం.
మనోళ్లకే అవకాశాలెక్కువ..
ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన కొత్త జోనల్ వ్యవస్థతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు భారీగా లబ్ధి కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు జోన్ల పరిధిలోని ఇతర జిల్లాలతో పోలిస్తే విద్యారంగంలో ఎంతో పురోగతి సాధించిన మన జిల్లా బిడ్డలకే అవకాశాలు ఎక్కువగా రానున్నాయి. ఉద్యోగాల భర్తీ మొదలైతే స్థానికంగా ఎక్కువ కొలువులు సాధించే అవకాశాలున్నాయి. ఇక నుంచి మన ఉద్యోగాలు మనకే దక్కుతాయి. జిల్లా, జోనల్, మల్టీ జోన్ పరిధిలో జరిగే ప్రత్యక్ష నియామకాల్లో 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి.
పరీక్షలపై అవగాహన కలుగుతుంది..
ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో అవగాహన సదస్సులు, కోచింగ్ సెంటర్ల ద్వారా పోటీ పరీక్షలు ఎలా రాయాలనే విషయాలపై స్పష్టమైన అవగాహన కలుగుతుంది. నేను గ్రూప్-1 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా. ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకుంటున్నా. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న శిక్షణ బాగుంది. ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో జోగు ఫౌండేషన్ సహకారంతో పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
– శిరీషా, గ్రూప్-1 అభ్యర్థి, నిర్మల్.
ప్రణాళికతో చదివితేనే విజయం
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సర్కారు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నది. ఇది నిరుద్యోగులకు వరంలాంటింది. ఇలాంటి సమయంలో అనవసర భయాలు పెంచుకోవద్దు. ఒత్తిడికి లోనుకావద్దు. భయం, ఆత్రుత అనేవి మొదలైతే అది వారి అవకాశాలను దెబ్బతీస్తుంది. వీటిని జయించాలంటే అభ్యర్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా ఒక టైం షెడ్యూల్ తయారు చేసుకోవాలి. దాని ప్రకారం చదవాలి. దాంతోపాటే అప్పడప్పుడు రిలాక్స్ కావాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. కొద్దో గొప్పో శారీరక శ్రమ ఉండాలి. అప్పుడే ఒత్తిడి దూరమవుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది సాధ్యమవువతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అలాగే గంటలకు గంటలు చదవకుండా మధ్యమధ్యలో బ్రేక్ తీసుకోవాలి. వీలైతే 30 నిమిషాలకోసారి రెండు నిమిషాల విరామం ఉంటే బాగుంటుంది. దాని వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
నిపుణుల సూచనలు అవసరం..
నా పేరు హిమబిందు.మాది ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ. నేను తెలంగాణ యూనివర్సి టీలో ఎమ్మెస్సీ(ఫిజిక్స్) చేస్తున్నా. తెలంగాణ సర్కారు గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువరించగా దరఖాస్తు చేసుకున్నా. ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్లో పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నా. అధ్యాపకులు చాలా బాగా బోధిస్తున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న సమయంలో నిపుణుల సూచనలు బాగా ఉపయోగపడు తాయి. ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో, జోగు ఫౌండేషన్ సహకారంతో ఆదిలాబాద్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారని తెలుసుకున్నా. ఇక్కడ బాలలత, వేప లాంటి నిష్ణాతులు సూచనలు ఇస్తారట. నేను సదస్సుకు తప్పకుండా హాజరవుతా. వారి సలహాలు ఉపయోగపడుతాయని భావిస్తున్న.
పోటీ పరీక్షలకు అవగాహన అవసరం..
నేను ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్లో గ్రూప్-1 ఉద్యోగ సాధనలో భాగంగా కోచింగ్ తీసుకుం టున్నా. అధ్యాపకులు వివిధ అంశాలను బాగా వివరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్టడీ మెటీరియల్ కూడా బాగుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తే వారిలో భయం పోవడమే కాకుండా సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కలుగుతుంది.
– రచన, గ్రూప్-1 అభ్యర్థి, బోథ్, ఆదిలాబాద్.