మంచిర్యాల, డిసెంబర్19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సంచలనంగా మారిన ఆరుగురు సజీవ దహనం కేసు కొలిక్కి వస్తున్నది. విచారణలో శాంతయ్యను చంపేందుకు తాము సుపారీ తీసుకున్నట్లు లక్షెట్టిపేటకు చెందిన రమేశ్ అనే వ్యక్తి ఒప్పుకున్నట్లు, సుపారీ గ్యాంగ్లో మిగిలిన వారు మాత్రం తమకు ఏం తెలియదని చెబుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. శాంతయ్య భార్య సృజన ప్రియుడైన లక్షెట్టిపేటకు చెందిన లక్ష్మణ్ (ఈయన డాక్యుమెంట్ రైటర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి) మొత్తం ఉదంతంలో సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. లక్ష్మణ్ గతంలో ఓ సారి శాంతయ్యను కిడ్నాప్ చేసి సింగరేణి జాబ్కు వలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, ఆ జాబ్ను సృజన కొడుకులకు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో తేలింది. అంతటితో ఊరుకోకుండా ఓ సారి యాక్సిడెంట్ చేసి హత్యాయత్నం చేసినట్లు విచారణలో తేలింది. ఈ విషయంలో పద్మ, సృజన కుటుంబాలు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు కూడా చేసుకున్నట్లు తెలియవచ్చింది. ఈ గొడవలు జరుగుతుండగానే హత్యకు పథకం వేసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
లక్షెట్టిపేట, గుడిపెల్లిలో పలువురి విచారణ..
సృజన కాల్ డేటా ఆధారంగా లక్షెట్టిపేట, గుడిపెల్లిలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరితో పాటు లక్షెట్టిపేటలో ఉండే శాంతయ్య అన్న, తమ్ముల కుటుంబ సభ్యులతో పాటు పలువురిని పోలీసులు తీసుకెళ్లి విచారించినట్లు తెలిసింది. శాంతయ్య మరణించి మూడు రోజుల కావస్తున్నా ఇప్పటి వరకు ఆయన మృతదేహాన్ని ఎవరూ తీసుకువెళ్లలేదు. ఇప్పటికీ మంచిర్యాల సర్కారు దవాఖానలోనే ఉంచారు. ఈ విషయంలో శాంతయ్య కుటుంబాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే గుడిపెల్లిలో హత్యకు సహకరించిన స్థానికుడు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతయ్య, పద్మ, శివయ్య ఇంట్లో ఉన్నారని సమాచారం ఇచ్చేందుకు సదరు వ్యక్తితో రూ.3 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆయన పుల్గా తాగి ఇంట్లో ఆరుగురు ఉన్నది చూడకుండా ముగ్గురే ఉన్నట్లు తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే మౌనిక, ఆమె ఇద్దరు పిల్లల కూడా బలైపోయినట్లు తేలింది. ఘటనపై మరింత క్లారిటీ కోసం పోలీసులు సోమవారం అర్ధరాత్రి సీన్-రీక్రియేషన్ చేయనున్నారు. ఈ మేరకు సీసీ చంద్రశేఖర్రెడ్డి, డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ ఎడ్ల మహేశ్ సోమవారం మరోసారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. జరిగింది హత్యగానే తాము భావిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.
ప్రమాదం కాదు.. హత్యే : సీపీ
మందమర్రి, డిసెంబర్ 19 : మండలంలోని వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని గుడిపెల్లి గ్రామంలో ఆరుగురు సజీవ దహనం సంఘటన ప్రమాదవశాత్తు జరగలేదని, పథకం ప్రకారమే హత్య చేశారని రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్, బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్, మందమర్రి సీఐ ప్రమోద్రావుతో కలిసి ఘటనా స్థలాన్ని సోమవారం పరిశీలించారు. దహనమైన ఇంటి పరిసరాలు, నిందితులు వదిలి వెళ్లిన పెట్రోల్ క్యాన్ల ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటనకు కారణాలను డీసీపీని అడిగి తెలుసుకున్నారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. నిందితులు పథకం ప్ర కారమే పెట్రోల్ పోసి నిప్పంటించి ఆరుగురిని హ త్య చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. త్వ రలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
పోలీసుల ఆధీనంలో ఘటనా స్థలం
గుడిపెల్లి గ్రామంలో ఘటన జరిగిన ఇల్లు పోలీసుల ఆధీనంలోనే ఉంది. పథకం ప్రకారం జరిగిన హత్యలుగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు విచారణలో భాగంగా స్థలం చుట్టూ షామియానాలు, రిబ్బన్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. ఘటన స్థలంలోకి గ్రామస్తులు, ఇతరులు వెళ్లకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
ఆరుగురి సజీవ దహనానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామానికి చెందిన పలువురు మహిళలు పోలీస్ అధికారులను కోరారు. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు చిన్నారులు బలవ్వడం బాధాకరమన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు.