ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 9 : పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సైన్స్, పర్యావరణ ప్రదర్శన పోటీలు ఆదిలాబాద్లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో నిర్వహించారు. ఈ మేళాలో 600 మంది విద్యార్థులు తమ ప్రయోగాలను ప్రదర్శించారు. శుక్రవారం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఎగ్జిబిట్లను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సైన్స్ మేళాలో విద్యార్థుల ఆవిష్కరణలను స్టేట్ అబ్జర్వర్ శుభదీప్ బెనర్జీ పరిశీలించారు. కాగా శనివారం వైజ్ఞానిక మేళా ముగియనున్నట్లు అధికారులు తెలిపారు.
వాహన దొంగతనాలకు చెక్
మేము తయారు చేసిన ప్రయోగం పేరు.. యాంటీ థెఫ్ట్ వెహికిల్. దీంతో వాహనాలు దొంగతనాలకు గురైనా ఇట్టే పట్టుకోవచ్చు. ప్రస్తుతం వాహనాలు ఎక్కువగా చోరీకి గురవుతున్నాయి. అవి దొరకడం కూడా కష్టంగా మారింది. వాహనాల చోరీని అరికట్టేందుకు ఈ పరికరం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెహికిల్ ట్రాకింగ్ యాంటీ థెఫ్ట్ త్రైఫ్ట్ విధానం ద్వారా సలువుగా కనిపెట్టవచ్చు. వాహనాన్ని దొంగిలిస్తే సెల్ ఫోన్కు మేసేజ్ వస్తుంది. వాహనాన్ని సెల్ ఫోన్తో లాక్ చేయవచ్చు. ఇలాంటివి అందుబాటులోకి వచ్చేలా చూడాలనేది మా తాపత్రయం.
-ఆరాధ్య, హరీశ్, తర్నం స్కూల్ నేరడిగొండ
సైబర్ క్రైమ్స్ నిరోధానికి..
మేము చేసిన ప్రయోగం ద్వారా సైబర్ నేరాలను నిరోధించవచ్చు. ప్రస్తుత ఆధునిక యుగంలో ఆన్లైన్ మోసాలకు చాలా మంది బలవుతున్నారు. మేము కోడ్ లాంగ్వేజ్తో లింకును తయారు చేసి ఫోన్లో మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్లకు లింకులు పంపినప్పుడు వాటిని మనం క్లిక్ చేసినా ఎటువంటి డాటా నష్టపోకుండా కాపాడుకోవచ్చు. ఇది ప్రస్తుతం అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.
-మణికంఠ, అభిషేక్, ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ ఆదిలాబాద్