కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 28: కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఈ ఏడాది సింగరేణి సంస్థ ప్రాతినిథ్యం వహిస్తున్నది. అందుకు కొత్తగూడెం కార్పొరేట్లోని ప్రకాశం స్టేడియంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కోలిండియా స్థాయి పోటీల్లో సింగరేణి జట్టు విజయ సాధనే లక్ష్యంగా క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా జరిగిన పోటీల్లో గెలుపొందిన జట్టుకు కొత్తగూడెంలో శిక్షణనిస్తున్నారు. కోలిండియా పోటీలకు ఎంపికైన క్రీడాకారులందరూ వారం రోజులుగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సింగరేణి తరఫున ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపిక చేసిన క్రీడాకారులు కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో సాధన చేయాల్సి ఉండగా, కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేశారు. కానీ గ్రౌండ్ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్న తరుణంలో రామవరంలోని గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్యాంపు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారు. సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల నుంచి కోలిండియాస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ఈ కోచింగ్ క్యాంపులో ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. గెలుపే లక్ష్యంగా మ హబూబ్నగర్కు చెందిన డీ నికేశ్ను కోచ్గా యాజమాన్యం ని యమించింది. ఆయన ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం, సా యంత్రం వేళల్లో క్రీడాకారులకు శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొందుతున్న 18 మంది క్రీడాకారులకు యాజమాన్యం టీఏ, డీఏలు ఇస్తున్నది. దీంతో పాటు గ్రౌండ్లో ఉదయం, సా యంత్రం వేళల్లో అవసరమైన పౌష్టికాహారాన్ని అందజేస్తున్నా రు. క్రీడాకారులందరూ కొత్తగూడెంలోని గెస్ట్హౌస్లు, లాడ్జీ ల్లో బస చేస్తూ రామవరంలోని గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు.
30 నుంచి ఫుట్బాల్ పోటీలు
కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీలను ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు సింగరేణి కొత్తగూ డెం కార్పొరేట్లోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో ని ర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది. కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీల్లో పా ల్గొంటున్న క్రీడాకారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నేషనల్ స్థాయిలో జరిగే ఫుట్బాల్ పోటీల మాదిరిగా ప్రకాశం స్టేడియం గ్రౌండ్ను తయారు చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీలకు సింగరేణి యాజమాన్యం ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యాజమాన్యం అన్ని చర్యలు చేపట్టింది. సింగరేణి సంస్థ ఇప్పటి వరకు 18 సార్లు కోలిండియా క్రీడలకు ప్రాతినిథ్యం వహించింది. ఇప్పుడు నిర్వహించనున్న ఫుట్బాల్ టోర్నమెంట్తో 19వ సారి ఆతిథ్యమివ్వనున్నది.
25 సార్లు పోటీల్లో పాల్గొన్నా
ఫుట్బాల్ పోటీల్లో ఇప్పటి వరకు 25 సార్లు కోలిండియా స్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొన్నా. 2001-02లో జరిగిన ఫుట్బాల్ పోటీల్లో సింగరేణి సంస్థ తరఫున సిల్వర్ మెడల్ గెలుచుకున్నాం. ఈ ఏడాది జరిగే కోలిండియా స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచేందుకు క్రీడాకారులందరం కఠోర శిక్షణ పొందుతున్నాం. గతంలో జరిగిన మిస్టేక్స్ ఏవీ జరగకుండా చూసుకొని కోచ్ ఇచ్చే మెళకువలు పాటిస్తూ మరింత తర్ఫీదు పొందుతున్నాం.
– సామల సత్యనారాయణ, జనరల్ మజ్దూర్, ఆర్జీ-1
క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి
సింగరేణి యాజమాన్యం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. కోలిండియా స్థాయిలో క్రీడాకారులు పాల్గొనేందుకు కోచ్లను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నది. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి.
– బూర్ల శ్రీనివాస్, ఎస్అండ్పీసీ, కొత్తగూడెం కార్పొరేట్
గెలిచేందుకు కృషి..
సింగరేణి తరఫున కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులందరూ తూచ తప్పకుండా నేను ఇస్తున్న సూచనలు పాటిస్తున్నారు. వారు కూడా కఠోర సాధన చేస్తున్నారు. ఈ నెల 30 నుంచి జరిగే కోలిండియా స్థాయి పోటీల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. క్రీడాకారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. వారి ఆసక్తితోనే శిక్షణ ఇవ్వగలుగుతున్నా. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ ఇస్తున్నాం. వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసే ఫుట్బాల్ క్రీడాకారులతో ఫ్రెండ్లీ మ్యాచ్లు నిర్వహిస్తున్నాం. దీంతో వివిధ ఏరియాల నుంచి వచ్చే క్రీడాకారులను ఎదుర్కొనేందుకు అవగాహన ఏర్పడుతుంది. సింగరేణి ఏర్పాట్లు, ప్రోత్సాహంతో కోలిండియా స్థాయిలో గెలుస్తామనే ధీమా ఏర్పడింది.
– డీ నికేశ్, కోచ్, మహబూబ్నగర్
ఈ నెల 30 నుంచి డిసెంబర్ 4 వరకు పోటీలు
ఈ నెల 30 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు కొత్తగూడెంలో జరిగే కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ టోర్నమెంట్లో 11 టీములు పాల్గొంటున్నాయి. సింగరేణితో పాటు బీసీసీఎల్, ఎస్డీసీఎల్, ఎస్సీఎల్, ఈసీఎల్, డబ్ల్యూసీఎల్, సీసీఎల్, ఎంసీఎల్, సీఐఎల్ తదితర బొగ్గు ఉత్పాదన సంస్థలు ఈ కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంటాయి. వివిధ రాష్ర్టాల నుంచి హాజరయ్యే క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం. పౌష్టికరమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నాం. కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీలు కొత్తగూడెంలో నిర్వహిస్తున్నందున సింగరేణితో పాటు స్థానిక పరిసర ప్రాంత క్రీడాకారులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి.
– చంద్రశేఖర్, డైరెక్టర్ (ప, ఆపరేషన్స్)