ఎదులాపురం, నవంబర్ 11 : పోడు భూముల సర్వే ఈ నెలాఖరులోగా పూర్తిచేసి, గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా అధికారులను రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్ నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో కలిసి మంత్రి పోడు భూముల సర్వేపై అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అధికారులను అభినందించారు. సీఎం కేసీఆర్ డిసెంబర్లో మహబూబాబాద్ జిల్లాలో పోడు హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. అంతకుముందే అన్ని జిల్లాల్లో సర్వే పూర్తిచేసి, గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. ప్రతీ దరఖాస్తు దారుడి భూమిని పరిశీలించాలన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. సర్వేను 20వ తేదీ నాటికి పూర్తిచేసి యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. అందుకు కావాల్సిన అదనపు సిబ్బందిని సమకూర్చుకోవాని సూచించారు.
జిల్లా స్థాయిలో తల్లిదండ్రుల పొషణకు సంబంధించిన అర్జీలను ఆర్డీవో నిర్ణీత సమయంలో చట్టప్రకారం పరిష్కరించాలన్నారు. కలెక్టర్ ప్రతి నెలా ఈ అంశంపై సమీక్షించాలని తెలిపారు. వృద్ధుల సంరక్షణ వారి పిల్లలపైనే ఉంటుందని, ఈ చట్టంపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఆ తర్వాత మహిళాశిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంరక్షణ బాధ్యత వారి పిల్లలపై ఉంటుందని తెలిపారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో 24,561 పోడుభూముల క్లెయిమ్స్ వచ్చాయని, 19,620 అర్జీల మేరకు సర్వే చేపట్టామని తెలిపారు. ఈ నెలలోగా సర్వే పూర్తిచేస్తామని చెపాపరు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఎఫ్వో రాజశేఖర్, అదనపు ఎస్పీ శ్రీనివాస్రావు, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఆరీడవో కిషన్, డీపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.