ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. నాలుగు జిల్లాల పరిధిలో 20,63,337 మంది ఓటర్లు ఉన్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మహిళా, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. కాగా.. డిసెంబర్ 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ నెల 26, 27.. డిసెంబర్ 10,11 తేదీల్లో ప్రతి పోలింగ్స్టేషన్లో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అనంతరం జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కాగా.. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1వ తేదీలను ప్రామాణికంగా తీసుకొని నాలుగు విడుతలుగా కొత్త ఓటర్లు నమోదు చేయనున్నారు.
మంచిర్యాల, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఆసిఫాబాద్, నవంబర్ 10 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. డిలేషన్స్, పర్మినెంట్ ట్రాన్స్ఫర్స్ను తొలగించగా, నాలుగు జిల్లాల్లో కలిపి మొత్తం 20,63,337 ఓటర్లు ఉన్నారు. ఇందులో 10.41 లక్షల మంది మహిళా ఓటర్లు, 10.18 లక్షలు పురుష, 107 మంది ట్రాన్స్జెండర్స్, 44 మంది ఎన్ఆర్ఐలు, 2,747 మంది సర్వీసు ఓటర్లు ఉ న్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉండగా.. మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో పురుషులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై డిసెంబర్ 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ నెల 26, 27, డిసెంబర్ 10,11 తేదీల్లో ప్రతి పోలింగ్స్టేషన్ లో ఓటరు నమోదుకు ప్ర త్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్ 26వ తేదీన వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించి, జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
నాలుగు విడతలుగా కొత్త ఓటర్ల నమోదు
గతంలో తుది ఓటర్ల జాబితా విడుదల అ య్యిందంటే కొత్తగా 18 ఏండ్లు నిండినవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు యేడాదిపాటు ఎదురుచూసేవారు. కానీ.. ఈ నిబంధనను ఎన్నికల సంఘం సవరించింది. దీంతో 2023 అక్టోబర్ 1వ తేదీ వరకు 18 ఏండ్లు నిండే వారు ఇప్పుడే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18 ఏండ్లు నిండిన వెంటనే వారి పేరు ఆటోమేటిక్గా ఓటరు జాబితాలో చేరిపోతుంది. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1వ తేదీలను ప్రామాణికంగా తీసుకొని నాలుగు విడతలుగా కొత్త ఓటర్లు నమోదు చేయనున్నారు.