కార్మిక సంఘాలు మరోమారు ఏకమయ్యాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై భగ్గుమన్నాయి. కార్మిక వ్యతిరేక విధానాలతో ప్రైవేటీకరణ దిశగా ముందుకు సాగుతూ, ప్రభుత్వరంగ సంస్థలను ఇష్టానుసారంగా అమ్ముతూ పోతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోల్బెల్ట్ ప్రాంతంలోని రామగుండం ప్రాంతానికి వస్తే అడ్డుకొని తీరుతామని ఆయా సంఘాల నాయకులు, కార్మికులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
ఈ నెల 12న రామగుండం ఫర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)ను ప్రారంభించేందుకు వస్తోన్న మోదీ ‘గో బ్యాక్’ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఎరువుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన కర్మాగారాన్ని ఇప్పుడు జాతికి అంకితమివ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోసారి ప్రారంభోత్సవం పేరిట ప్రచారం చేసుకోవడానికి, బీజేపీకి లబ్ధి కల్పించుకోవడానికే మోదీ ఇక్కడకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ రాకను నిరసిస్తూ బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాగా.. టీబీజీకేఎస్తోపాటు జాతీయ కార్మిక సంఘాలు నేటి నుంచి మూడు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.
మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గోదావరిఖని, నవంబర్ 9 : ఏడాదిన్నర క్రితం ఉత్పత్తిలోకి వచ్చిన ఆర్ఎఫ్సీఎల్ను మళ్లీ జాతికి అంకితం చేసే పేరుతో వస్తున్న ప్రధాని నరేంద్రమోదీపై సింగరేణి కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఒకసారి ప్రారంభమైన కర్మాగారాన్ని తిరిగి మళ్లీ జాతికి ఉత్పత్తి చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సిం గరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తున్న ప్రధాని ఈ ప్రాం తంలో పర్యటించకుండా అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నాయి.
సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు అంటగట్టే ప్రయత్నం చేయడంతో కార్మిక వర్గం, సంఘాలు ఏకమై పోరాటాలు సాగించాయి. సమ్మెలోకి వెళ్లి తమ నిరసనను తెలియజేశాయి. దీంతో కొంత మేర తగ్గినట్లు కనిపించినా అ త ర్వాత ప్రధాని మోదీ ధోరణిలో మార్పు కనిపించలేదు. ఇప్పటికే కోలిండియాలో కొంత మేర వాటాలను స్టాక్ మార్కెట్ ద్వారా అమ్మి సొమ్ము చేసుకున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో తమకున్న 49 శాతం వాటాను ప్రైవేట్ వ్యక్తులకు అ మ్మడం, అంటగట్టడం ద్వారా కార్మిక వర్గాన్ని ఇబ్బందులకు గు రిచేయాలని భావిస్తున్నది.
సింగరేణిలో కేంద్రానికి ఉన్న వాటా ను రాష్ర్టానికి ఇవ్వాలని ఇప్పటికే కేసీఆర్ ప్రతిపాదించారు. రాష్ర్టానికి మంచి పేరు రావడం ఇష్టం లేక, అదానీ, అంబానీ వంటి పెద్ద మనుషులకు అమ్మాలని మోదీ ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వస్తూనే ఉన్నా యి. బొగ్గు గని కార్మికుల వేజ్బోర్డు ఐదేళ్లకోసారి పెంచాల్సి ఉంది. గత వేతన ఒప్పందాల్లో ఏళ్ల తరబడి జాప్యం ఉండడం, అ నుకున్న మేర వేతనాలు పెరగకపోవడంతో కార్మికుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. 2021 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 11వ వేతన ఒప్పం దం 17 నెలలు గడుస్తున్నా అతీగతి లేకుండా పోయింది.
ఈసా రి వేతన ఒప్పందంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (డీపీఈ) గైడ్లైన్స్ను పెట్టి వేతనాలు పెరగకుండా కేంద్ర ప్రభు త్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. వేజ్బోర్డు చైర్మన్, బొగ్గు పరిశ్రమల యాజమాన్యాలు డీపీఈ గైడ్లైన్స్ను బూచిగా చూపి వేతనాలు పెంచకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఒక్క రూపాయి పెన్షన్ పెరగక, పెరుగుతున్న ధరలను తట్టుకోలేక రిటైర్డ్ కార్మికులు అందోళన చెందుతున్నారు. ఇటీవలే ప్రతి టన్ను బొగ్గుపై రూ.10 వసూలు చే యడం, కార్మికులకు చెల్లిస్త్తున్న బేసిక్ వేతనాలపై గతంలో పెన్షన్ ఫండ్కు చెల్లిస్త్తున్న 3.16 శాతాన్ని 7 శాతానికి పెంచి మినహాయించుకుంటున్నా పెన్షన్ మాత్రం పెంచడం లేదు. వీటన్నింటిపై కార్మికవర్గం గుస్సగా ఉన్నది.
సంఘాల ఉనికి లేకుండా చట్టాలు..
తమ హక్కుల కోసం ఉద్యమించే ప్రయత్నాలు చేస్తున్న కార్మి క సంఘాల ఉనికి లేకుండా కేంద్రం కొత్త చట్టాలను రూపొందించింది. కార్మిక సంఘాలకు కత్తెర వేసే విధంగా 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మిక హక్కులు హరించేలా ప్రయత్నిస్తున్నది. కార్మికులను కట్టు బానిసలుగా చేసేలా చట్టాలను రూపొందించి ముందుకు సాగుతున్నది. వీటిపైనా కార్మిక సంఘాలు పోరుబాట పడుతున్నాయి. విభజన చట్టంలో ఉన్న విధంగా రామగుండం ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ అవసరాలకు కరెంట్ వినియోగించుకునేలా చేయాల్సి ఉండగా. కేవలం 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. మిగతా 2400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్టీపీసీ యాజమాన్యం సిద్ధంగా ఉన్నా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయడం లేదు. వీటన్నింటిపైనా గుర్రుగా ఉన్న కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు నరేంద్రమోదీపై విరుచుకు పడుతున్నారు. ప్రధాని ఈ ప్రాంతానికి వస్తే అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
రూ.1.75 లక్షల కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యం.. .
బొగ్గు రంగం నుంచి బ్యాంకింగ్ రంగం వరకు, ఎయిర్ ఇం డియా నుంచి ఎల్ఐసీ వరకు అన్ని పరిశ్రమలను ప్రైవేట్కు కట్టబెట్టడమే ధ్యేయంగా మోదీ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశానికి అత్యంత కీలకమైన బొగ్గురంగాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 500 బొగ్గు బ్లాక్లను ప్రైవేట్పరం చేసి రూ.1.75 లక్షల కోట్లు కొల్లగొట్టాలనేది అసలు లక్ష్యం. ఆ ధనదాహం తీర్చుకునే క్రమంలోనే బొగ్గు గనుల అభివృద్ధి నియంత్రణ చట్టం-1957ను రద్దు చేసి కోల్మైన్స్ ప్రొవిజన్ యాక్ట్-2015ను అమల్లోకి తెచ్చారు. దీని ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. అలా 2016-17 నుంచి ఇప్పటి వరకు 32 బొగ్గు గనులను వేలం ద్వారా వివిధ కంపెనీలకు కట్టబెట్టారు. ఇంకా కట్టబెడుతూనే ఉన్నారు.
సింగరేణి సంస్థకు రూ.150 కోట్ల నష్టం..
కొత్తగా చేసిన చట్ట సవరణతో సింగరేణి సంస్థ ఉన్న ఫలంగా రూ.150 కోట్లు నష్టపోయింది. సాధారణంగా ఒక దగ్గర మైనింగ్ పూర్తయ్యాక మరో దగ్గర మైనింగ్ మొదలుపెడుతారు. ఇందుకోసం ఎక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు (సైట్ స్పెసిఫిక్) చేస్తారు. ఇలా సింగరేణి సంస్థ భవిష్యత్ అవసరాల కోసం ఇల్లందు డివిజన్లోని కోయగూడెం, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్, మందమర్రి డివిజన్లో కాసిపేట, కాసిపేట-2 ఓపెన్ కాస్ట్లతో బొగ్గు నిక్షేపాలను గుర్తించింది. ల్యాండ్ సర్వే, విద్యుత్ లైన్ల ఏర్పాటు, ఎంత బొగ్గు వెలికి తీయొచ్చు అని తెలుసుకునేందుకు రూ.150 కోట్లు ఖర్చు పెట్టింది. తీరా ఇప్పుడు వాటిని సింగరేణి తవ్వుకోడానికి వీలులేదు. అందరితో పాటు మీరు వేలంలో పాల్గొనాలని కేంద్రం చెబుతున్నది. ఇలా ఒక పబ్లిక్ సెక్టార్ పెట్టుబడిదారులతో పోటీ పడాలంటే వేలంలో అధిక మొత్తానికి బొగ్గు బ్లాక్లను దక్కించుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా సంస్థపై భారం పడి పెట్టుబడిని తగ్గించుకునే క్రమంలో కార్మికులను తగ్గించుకోవడం లేదా కార్మికులకు ఇస్తున్న ప్రయోజనాలను విరమించుకోవడం చేయాల్సి వస్తుందని కార్మిక వర్గాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కార్మికులకు ఐటీ వేధింపులు..
ఇవి కాకుండా ఆదాయపన్ను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం బొగ్గుగని కార్మికులను ఏళ్లుగా వేధిస్తోంది. కార్మికుల నుంచి బలవంతంగా ఐటీ వసూలు చేస్తూనే ఉంది. రూ.8 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారు 20శాతం పన్ను కట్టాలి అంటున్నారు. దీంతో దాదాపు 30వేల మంది కార్మికులపై భారం పడుతున్నది. ఏడాదికి రెండు నెలల జీతం ఐటీగా చెల్లించాల్సి వస్తుంది. బొగ్గు కోసం నానా కష్టాలు పడే కార్మికులకు ఐటీ ఉండొద్దని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తున్నది. 2014 మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి బొగ్గుగని కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని తీర్మానం చేసి పంపినా.. ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ప్రైవేటీకరణ పేరుతో అటు బొగ్గు బ్లాక్లను లాక్కుంటూ.. ఇటు ఐటీ పేరుతో కార్మికులను వేధిస్తూ.. సింగరేణి సంస్థనే లేకుండా చేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది.