భీంపూర్, నవంబర్ 9: గ్రామంలో తరతరాల నుంచి ఉమ్మడి వ్యవసాయ కుటుంబం వారిది. స్వయం కృషితో సత్ఫలితాలు సాధిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం మారుమూల పెన్గంగ ఒడ్డున ఉన్న గోముత్రి గ్రామానికి చెందిన రావుల ఎర్రన్న కష్టాన్నే నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు. భార్య లక్ష్మి ముగ్గురు కొడుకులు విజయ్, సాయి, సంతోష్ ఉన్నారు. వీరిలో విజయ్, సంతోష్కు వివాహమైంది. సాయి నాందేడ్లో బీఈడీ చదువుతున్నాడు. ఎర్రన్న, భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి భూతల్లిని నమ్ముకొని ఆదాయం పొందుతున్నాడు.
30 ఎకరాల్లో సిరుల పంట
ఈ కుటుంబానికి గోముత్రి శివారులో 30 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. సంప్రదాయ పత్తితో పాటు అంతర పంటగా కంది, జొన్న.గోధుమ సాగు చేస్తున్నారు. రెండెకరాల్లో పండ్ల తోట వేశారు. కూరగాయలు, ఆకుకూరలు కూడా పండిస్తున్నారు. పండ్లతోటలో జామ, ఉసిరి, అరటి, దానిమ్మ, బొప్పాయి మొక్కలు పెంచుతున్నారు. వీటిలో చాలా వరకు ఈజీఎస్ నర్సరీల నుంచి తీసుకున్నారు. సర్పంచ్ వేణుతో పాటు కార్యదర్శి కూడా ఈ రైతు కుటుంబం ఉత్సాహం చూసి సహకరిస్తున్నారు. ఈ తోటలో 600 జామ చెట్లు ఉండగా, ఏడాది నుంచి పంటనిస్తున్నాయి. ఏడాదికి జామ సగటున 25 క్వింటాళ్ల వరకు వస్తుండగా, స్థానికంగానే రూ.40కి కిలో చొప్పున అమ్ముతారు. ఉద్యానవనశాఖ అధికారులు కూడా పంటను సందర్శించి, పలు సలహాలు అందిస్తున్నట్లు రైతు చెబుతున్నారు.
పాడి పెంపకంతో అదనపు ఆదాయం
పాడిపై కూడా ఈ కుటుంబం దృష్టి పెట్టింది. ప్రస్తుతం వీరి వద్ద 30 జెర్సీ, స్థానిక బర్రెలు, ఆవులు ఉన్నాయి. రావుల సంతోష్ యాదవ్ రోజూ చేనుగట్లపై చిట్టడవిలో ఈ మందను మేతకు తీసుకెళ్తాడు. ప్రత్యేకించి వీటి కోసం గడ్డిపెంపకం కూడా చేస్తున్నారు. రోజుకి 30 లీటర్లు పాలు ఇస్తుండగా, ఇంటి అవసరాలకు పోగా, మిగతావి లీటరు రూ.60 చొప్పున అమ్ముతుంటారు. ఇలా పాలతో రోజుకు రూ.1200 నుంచి రూ. 1500 వరకు ఆదాయం వస్తున్నది..
కోళ్ల పెంపకం
ప్రస్తుతం 600 నాటు కోళ్లు పెంచుతున్నారు. ఇంటి ఆవరణలో వీటి కోసం ప్రత్యేక షెడ్ ఉంటుంది. కాసేపు బయట కూడా తిప్పుతారు. పండుగలు, సాధారణ రోజుల్లో వీరి వద్దకు వచ్చి నాటుకోళ్లను కిలో రూ.500- రూ.600 వరకు చెల్లిస్తున్నారు. ఇక నాటు కోడిగుడ్లను బలవర్ధక అహారంగా తీసుకెళ్తున్నారు.
పెన్గంగతో సాగునీటి సౌకర్యం..
వాణిజ్య, ఆహార ధాన్య పంటలు, పండ్ల తోటల్లో సాగునీరందించేందుకు వీరికి దగ్గరలోనే పెన్గంగ ఆధారంగా మారింది. అక్కడి నుంచి పైప్లైన్తో నీరు డంప్ చేస్తుంటారు. వేసవిలో అవసరమైతే ప్రత్యామ్నామ మార్గాల్లో నీటి తడులు ఇస్తుంటారు.
పశుమందతో సేంద్రియ ఎరువుల తయారీ
పశుపెంటలను ఏటా వేసవిలో చేనులో చల్లుతుంటారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందులను అతి తక్కువ వాడుతుంటారు. సేంద్రియ ఎరువే ఆరోగ్యానికి మంచిదని వీరికి అవగాహన ఉండడంతో, ఆదిశగా ప్రయత్నిస్తున్నారు. తద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందంటున్నారు.
స్వయం కృషితోనే పంటలు
నేను పదోతరగతి వరకు చదువుకున్న. మా నాన్నకు ముగ్గురం కొడుకులం. ఇంట్లో అందరం కలిసి కష్టపడి ఎవుసం చేసుకుంటున్నం.సీఎం కేసీఆర్ సారు రైతులకోసం ఎంతో చేస్తున్నరు. సర్కారు పథకాలతో రైతులందరికీ మేలు జరుగుతది. ఇప్పుడైతే ఖర్చులన్నీ పోనూ ఏడాదికి సగటున రూ.12లక్షల నుంచి రూ. 15 లక్షల ఆదాయం మిగులుతున్నది.
-రావుల సంతోష్, యువరైతు, గోముత్రి