జైనథ్, నవంబర్ 8 : జైనథ్ మండలంలోని హత్తిఘాట్ పంప్హౌస్ సమీపంలోని కాలువల్లో మంగళవారం రెండు పులుల సంచారం కలకలం రేపింది. డ్యూటీలో ఉన్న ఇంజినీర్లు వినోద్, మనోహార్రెడ్డి పనులు చేస్తుండగా వారి కంటపడ్డాయి. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో డెలివరీ డిస్ట్రిబ్యూటరీ పెద్ద కాలువలో పడుకొని ఉన్న పులులు, తమ చప్పుడు విని పరుగులు తీసినట్లు తెలిపారు. వెంటనే అటువైపు ఉన్న ఇతర సిబ్బందిని ఫోన్ ద్వారా అప్రమత్తం చేసి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
అటవీ శాఖ అధికారుల గాలింపు..
సమాచారం అందుకున్న అటవీశాఖ జిల్లా అధికారి రాజశేఖర్, ఎఫ్ఆరోవ గులాబ్సింగ్, ఎఫ్ఎస్వో ప్రేమ్సింగ్ సిబ్బందితో కలిసి హుటాహుటినా హత్తిఘాట్ చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. పులులు సంచరించిన స్థలంతోపాటు పరిసరాల్లో పాదముద్రలు, ఆనవాళ్లు సేకరించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులల అభయారణ్యం నుంచి పెన్గంగ మీదుగా అవి ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నారు. కాగా స్థానికుల ఫిర్యాదు మేరకు హత్తిఘాట్ శివారులో రాత్రింభవళ్లు షిప్టుల వారీగా బేస్క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీశాఖ అధికారుల బృందాలు గస్తీ తిరుగుతాని వెల్లడించారు. ఇదిలా ఉండగా పులులు గంటపాటు కాలువల్లోనే సంచరించి, తిరిగి పెన్గంగ పరివాహక ప్రాంతంలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
గ్రామాల్లో అవగాహన..
భీంపూర్, నవంబర్ 8 : పులుల సంచారంతో భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్ సమీప సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఎఫ్ఆర్వో గులాబ్ సింగ్, ఎఫ్ఎస్వోలు గులాబ్, ప్రేమ్సింగ్, సిబ్బంది అవగాహన కల్పించారు. రైతులు, పశు కాపరులు చేలలోకి వెళ్లి, వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, భయపడే అవసరం లేదని సూచించారు. పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నామన్నారు. రెండు వారాల క్రితం తాంసి(కే) పెన్గంగ పరీవాహక ప్రాంతంలో పెద్దపులి కదలికలు కనిపంచగా అటవీశాఖ అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టారు. సమీప మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచే పులుల వలస ఉందని అధికారులు పేర్కొంటున్నారు.