మంచిర్యాల, నవంబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సర్కారు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ దవాఖానలను తనిఖీలు చేశారు. సెప్టెంబర్ చివరలో దాదాపు పది రోజులపాటు విస్తృతంగా పరిశీలించి.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 61 దవాఖానలకు నోటీసులు జారీ చేశారు. ఇందులో చాలా వరకు నిబంధనల మేరకు సవరించుకున్నారు. కానీ.. మంచిర్యాల జిల్లాకేంద్రంలోని ధర్మరాజు టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్ మాత్రం అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నది. అసలైతే నర్సింగ్ హోంకు మాత్రమే అనుమతి ఉన్నది. టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్ బోర్డు పెట్టి నడుపుతున్నారు. అధి కారులు బోర్డు తొలగించాలని ఆదేశించినా పట్టించు కోవడం లేదు. ఇంకా.. నాలాను ఆక్రమించి కారు పార్కింగ్ కోసం షెడ్డు వేశారు. జనరేటర్ కూడా ఏర్పాటు చేశారు. అందరికీ ఒక నీతి.. ఈ దవాఖానకో నీతా? అని ప్రైవేట్ హాస్పిటల్స్ వర్గాలు కోపంగా ఉన్నాయి.
అది మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ధర్మరాజు దవాఖాన. నర్సింగ్ హోం అనుమతితో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్గా నడుస్తున్నది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ చేసిన తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తనిఖీ చేసిన అధికారులు పక్షం రోజుల్లో బోర్డు మార్చుకోవాలని నోటీసులు జారీ చేశారు. కానీ.. ఆ ఆస్పత్రి యాజమాన్యం నోటీసులను పట్టించుకోలేదు. ‘పైగా సదరు డాక్టరమ్మ అధికారులకే ఏం తెలియదు.. నిబంధనలకు విరుద్ధంగా మాకు నోటీసులు ఇచ్చారంటూ బుకాయిస్తున్నాయి.’ మరీ ఆ మేడం చెప్పింది నిజమే కావచ్చని జిల్లా వైద్యాధికారిని సంప్రదిస్తే.. ‘ధర్మరాజు దవాఖానకు ఉన్న రిజిస్ట్రేషన్ నర్సింగ్ హోం మాత్రమే.. ఈ మధ్య వాళ్లు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడపడం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన రిసీవ్డ్ కాపీ చూపిస్తున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ బృందం వచ్చి తనిఖీ చేసి ఈ ఆసుపత్రికి అర్హత ఉందా? లేదా? అని పరిశీలించాకే అనుమతి ఇస్తారు. దానిపైనే మేం నోటీసులు ఇచ్చాం. కానీ ఆ డాక్టర్ మేం అప్లయ్ చేశాం కదా.. ప్రాక్టిక్ చేసుకుంటే తప్పేంటి అనే భావనలో ఉన్నారు. నాకు రిజిస్ట్రేషన్ ఉంది. ఎప్పటి నుంచో చేస్తున్నా.. అని మాట్లాడుతున్నారు. నిబంధనల ప్రకారమైతే ఆ ఆసుపత్రి బోర్డు నర్సింగ్ హోం అని మాత్రమే ఉండాలి’ అని స్పష్టంగా చెప్పారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నోటీసులు తీసుకున్న ఆస్పత్రులు అన్నింటినీ ‘నమస్తే తెలంగాణ’ నిశితంగా పరిశీలించింది. ఆ వివరాలు ఇలా..
నాలా ఆక్రమించి జనరేటర్.. రోడ్డు ఆక్రమించి పార్కింగ్ షెడ్డు..
ధర్మరాజు ఆసుపత్రి చేసే నిబంధనలకు విరుద్ధమైన పనులు అన్నీ ఇన్నీ కావు. ఆసుపత్రి ముందున్న రోడ్డును 20శాతం వరకు ఆక్రమించి కారు పార్కింగ్ కోసం షెడ్డు వేశారు. అక్కడ నిత్యం రెండు నుంచి మూడు కార్లను పార్క్ చేస్తున్నారు. వాటి పక్కనే ఆసుపత్రికి వచ్చివెళ్లే వారి వాహనాలను నిలుపుతున్నారు. ఆసుపత్రికి పార్కింగ్ లేక రోడ్డుపైనే వామనాలు నిలుపుతుండటంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకే సారి పెద్ద వాహనాలు వచ్చినప్పుడు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇకపోతే పార్కింగ్ షెడ్డు పక్కనే ఉన్న నాలాను ఆక్రమించి ఆసుపత్రి జనరేటర్ ఏర్పాటు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగానే ఉంది. దీనిపై ప్రశ్నించినప్పుడు సదరు ఆసుపత్రి యాజమాన్యం సమాధానం చెప్పకుండా దాటవేసింది.
నోటీసులిచ్చిన మారని తీరు..
మంచిర్యాల జిల్లాలో ధర్మరాజు ఆస్పత్రితోపాటు మరో మూడు దవాఖానలు, ఓ వైద్యుడికి నోటీసులు ఇచ్చారు. దానికి స్పందించి మార్పులు చేసుకున్నారు. మెడిలైఫ్లో పని చేసే ఉక్రెయిన్లో ఎండీ చేసిన వైద్యుడు చేతన్ చౌహాన్ వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు ఎండీ ఈక్వల్స్ టూ ఎంబీబీఎస్ అని నేమ్ బోర్డును మార్చుకున్నాడు. ఓం సాయి ఆస్పత్రిలో పనిచేసే డ్యూటీ నర్సుల్లో ఐదుగురికి సర్టిఫికేట్స్ లేవని నోటీసులు ఇస్తే.. ఆ మరునాడే నర్సులు సమర్పించారు. మిగిలిన రెండు ఆస్పత్రులు వైద్యాధికారుల సూచనల మేరకు మార్పులు చేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 46 ఆస్పత్రులకు నోటీసుకులు ఇచ్చారు. ఇందులో ఏడు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నడుస్తున్నట్లు గుర్తించారు.
ఒకటి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. మిగిలిన రెండు లక్ష్మీనారసింహ, వినాయక్ డయాగ్నోస్టిక్లను నోటీసులు ఇచ్చిన నాటి నుంచి మూసే ఉంటున్నాయి. ఇక మిగిలిన నాలుగు పీసీబీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, అవి రాగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటామని డీఎంహెచ్వోకు రిటర్న్గా రాసిచ్చాయి. నిర్మల్ జిల్లాలో వైద్యుల పేర్లు, డిగ్రీలు డిస్ప్లే చేయకపోవడం, ఆస్పత్రుల్లో తగినంత సిబ్బంది లేకపోవడంతో పది ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చారు. ఆయా ఆస్పత్రులు వెంటనే వైద్యారోగ్య శాఖ చేసిన సూచనల మేరకు మార్పులు చేసుకున్నాయి. దాదాపుగా నోటీసులు ఇచ్చిన అన్ని ఆస్పత్రులు వైద్యారోగ్యశాఖ చేసిన సూచనల మేరకు మార్పులు చేసుకోగా.. ఒక్క ధర్మరాజు దవాఖాన మాత్రం పేరు మార్చుకోకపోవడం గమనార్హం.
ఉమ్మడి జిల్లాలో 61 దవాఖానలకు నోటీసులు..
వైద్యారోగ్య శాఖ అధికారులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు పది రోజులపాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 253 ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేసి నిబంధనలు పాటించని 61 దవాఖానలకు నోటీసులు జారీ చేశారు. జిల్లాకు ఐదు నుంచి ఆరు బృందాల చొప్పున 20కి పైగా వైద్యారోగ్య శాఖ అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ అయ్యిందా? లేదా? అందులో క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారా? లేదా? మల్టీస్పెషాలిటీ దవాఖానల్లో ఆయా స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నారా? ఒక స్పెషలిస్టు వైద్యుడు ఉండే వేరే స్పెషాలిటీలో వైద్యం ఏమైనా అందిస్తున్నాడా? అనే అంశాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్లను, వైద్యుల డిగ్రీలను తనిఖీ చేసి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి నోటీసులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ఆదేశాల మేరకు చర్యలు
మంచిర్యాల జిల్లాలో తనిఖీల అనంతరం గతంలో చేసుకున్న రిజిస్ట్రేషన్స్ రెన్యువల్ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్ల కోసం చాలా మంది వస్తున్నారు. రోజూ ఐదు నుంచి ఆరు ఫైళ్లపై సంతకాలు చేస్తున్నాం. స్పందన బాగుంది. నోటీసులు ఇచ్చిన ఐదు ఆస్పత్రుల్లో నాలుగు దవాఖానలు స్పందించాయి. ధర్మరాజు దవాఖాన మాత్రం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కోసం చేసుకున్న దరఖాస్తు చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ఆదేశాల మేరకు ఎదురుచూస్తున్నాం. స్పష్టత వచ్చిన వెంటనే నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– జీవీ సుబ్బారాయుడు, డీఎంహెచ్వో, మంచిర్యాల.
నేను ఎందుకు బోర్డు మార్చుకోవాలి..
మాకు అసలు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. తనిఖీకి వచ్చిన అధికారులకు అర్థం కాక ఇచ్చారు. నేను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పెట్టి 20 ఏండ్లు అయ్యింది. కొత్తగా ఏఆర్టీ బిల్ వచ్చింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహణకు అనుమతులు ఇవ్వాలి. దానికి మేం దరఖాస్తు చేసుకున్నాం. ఇవేవీ అడగకుండా వచ్చిన జిల్లా అధికారులు నోటీసులు ఇచ్చారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించి పర్మిషన్ ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. అప్పటివరకు నేను ఎందుకు బోర్డు మార్చుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని సెంటర్లు ఉన్నాయో అన్నింటి పరిస్థితి ఇదే. అధికారులు వచ్చి చెక్చేస్తే నేను కాదన్ననా.. సమస్య నాది కాదు అధికారులది.వాళ్ల టెక్నికల్ ప్రాబ్లమ్కు నేను బోర్డు ఎందుకు మార్చుకుంటా.
– అగుమంచి రాణి, వైద్యురాలు, ధర్మరాజు దవాఖాన.
ధర్మరాజు హాస్పిటల్ మార్చుకోవడం లేదు..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు..సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ప్రైవేట్ దవాఖానల్లో విస్తృతంగా తనిఖీలు చేశాం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 253 ప్రైవేట్ దవాఖానాలు తనిఖీ చేయగా.. నిబంధనలు పాటించని 61 హాస్పిటళ్లకు ఆయా జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందరూ నిబంధనల మేరకు సవరించుకున్నారు. కానీ.. ధర్మరాజు దవాఖాన మాత్రం సవరించుకోవడం లేదు.
– జీవీ సుబ్బారాయుడు, డీఎంహెచ్వో (మంచిర్యాల)
నేనెందుకు బోర్డు మార్చుకోవాలి..
నేను టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్ పెట్టి 20 ఏండ్లు అవుతున్నది. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా. కేంద్ర బృందం పరిశీలించి అనుమతి ఇవ్వడానికి సమయం పడుతుంది. అధికారులు చెక్ చేసుకోంగ వద్దన్నామా? సమస్య నాది కాదు అధికారులది. వాళ్ల టెక్నికల్ ప్రాబ్లమ్కు నేను బోర్డు ఎందుకు మార్చుకోవాలి. అధికారులు అర్థం కాక తనిఖీలకు వచ్చారు. మాకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
– అగుమంచి రాణి, వైద్యురాలు, ధర్మరాజు దవాఖాన.