చింతలమానేపల్లి, నవంబర్ 8: అసలే మారుమూల ప్రాంతం..అందునా గిరిపుత్రులు.. అడవిని నమ్ముకుని జీవించే వీరికి మారిన పరిస్థితులు కష్టాన్ని తెచ్చి పెట్టాయి. దీంతో ఉపాధి కరువైంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి వీరికి పట్టు పురుగుల పెంపకం ద్వారా ఉపాధి కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం 66 కుటుంబాలు ఇందులో ఉపాధి పొందు తుండగా, రానున్న రోజుల్లో 250 కుటుం బాలకు పనికల్పిస్తామని చెబుతున్నారు. అడవే ఆధారంగా బతికిన ఆ కుటుంబాలు తమకు ఆసరాగా నిలిచిన ప్రభుత్వం, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అటవీ ప్రాంతంలో మారిన పరిస్థితులతో గిరిపుత్రులకు ఉపాధి కరువైంది. దీంతో వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. చింతలమానేపల్లి మండలంలోని అంబగట్ట గ్రామ సమీపంలో పట్టు పురుగుల పెంపకానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. కాగజ్నగర్ డివిజన్లోని తలోడి క్లస్టర్ కర్జవెల్లి రేంజ్ పరిధిలోని అంబగట్ట, కోర్సిని, దిందా, కేతిని, బెజ్జూర్ రేంజ్ పరిధిలోని కాటేపల్లి, గ్రామాల్లో నివసిస్తున్న పలు కుటుంబాలు ఈ పట్టు పురుగుల పెంపకంతో ఉపాధి పొందుతున్నాయి. కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రత్యేక చొరవ తీసుకొని పట్టు పరిశ్రమ ద్వారా గిరి పుత్రులకు అండగా నిలిచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
గిరిజనుల జీవన విధానం, వారి ఉపాధిపై స్టడీ చేసి, పట్టు పురుగుల పెంపకం చేపట్టేందుకు అలోచన చేశారు. అనుకున్నదే తడవుగా ఉద్యాన శాఖ అధికారులతో అంబగట్ట గ్రామంలో సమావేశం నిర్వహించి, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అడవిలో పట్టు పురుగులు పెంచేందుకు మద్ది చెట్లను ఉపాధి వనరుగా ప్రాజెక్ట్ను ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం చొరవతో ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా పట్టు పురుగులను పెంచుతున్నారు. రెండు నెలల్లో ఈ పట్టు కాయలు చేతికి వస్తాయని, ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిని చెన్నూర్ ఓపెన్ మార్కెట్లో గ్రేడుల వారీగా కొనుగోలు చేస్తారని తెలిపారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఉపాధి పొందవచ్చునని, అలాగే కూలీలకు కూడా (ఎన్ఆర్ఈజీఏ) ద్వారా డబ్బులు వస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం 66 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని, త్వరలోనే 250 కుటుంబాలకు ఉపాధి కల్పించేలా దశల వారీగా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కాగా, ఉద్యాన అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు గిరిపుత్రులకు అందిస్తున్నారు.
పెంపకంపై అవగాహన కల్పిస్తున్నం..
పట్టు పురుగుల పెంపకంపై గిరిజనులకు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అంబగట్ట గ్రామంలోని 66 కుటుంబాలకు 40 శాతం సబ్సిడీతో ఉద్యాన శాఖ నుంచి పట్టు పురుగులను అందజేశాం. ఈ పురుగులకు పక్షులు, వన్యప్రాణుల నుంచి సంరక్షణకు తీసుకోవాల్సిన సలహాలను సూచించాం. కాగజ్నగర్ డివిజన్లోని తలోడి క్లస్టర్ కర్జవెల్లి, బెజ్జూర్ రేంజ్ పరిధిలోని అంబగట్ట, కోర్సిని, కేతిని, దిందా, కాటేపల్లి, గ్రామాల్లో 250 కుటుంబాలు పట్టు పురుగులను పెంచి, గతంలో ఉపాధి పొందేవారు. త్వరలోనే దశల వారీగా పట్టు పురుగులను అన్ని కుటుంబాలకు అందించి, వారికి ఉపాథి కల్పించేలా ఉద్యాన శాఖ ద్వారా చర్యలు తీసుకుంటున్నాం.
–శాంతి ప్రియదర్శిని(ఉద్యాన శాఖ డివిజన్ అధికారి కాగజ్నగర్)
ఉపాధి దొరికింది..
పట్టు పురుగుల పెంపకంతో మాకు ఉపాధి దొరికింది. కుటుంబ పోషణకు ఇబ్బందుల్లేకుం డయ్యింది. గతంలో మా గిరిజనులు అడవినే ఆధారంగా చేసుకొని పట్టు పురుగుల పెంపకం చేపట్టి ఉపాధి పొందేవారు. కానీ అటవీ శాఖ అధికారులు మమ్మల్ని అడవిలోనికి వెళ్లనీయడం లేదు. దీంతో మాకు ఉపాధి కరువై చాలా ఇబ్బందులు పడ్డాం. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఉద్యాన శాఖ అధికారులు మళ్లీ మాకు పట్టు పురుగులు పెంచేందుకు అవకాశం కల్పించిన్రు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి అడవుల్లోకి వెళ్లేందుకు అనుమతించడంతో పట్టు పురుగులను పెంచుతున్నం.
–బిబ్బెర లస్మక్క(అంబగట్ట )
ప్రభుత్వ చొరవ వల్లే..
మాకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా తాతల కాలం నుంచి అడవినే నమ్ముకొని బతుకుతున్నం. పట్టు పురుగుల పెంపకమే మాకు ఆధారం. 2018 నుంచి మాకు ఉపాధి కరువైంది. పట్టు పురుగులు పెంచేందుకు అటవీ శాఖ అధికారులు అడవిలోకి అనుమతించలేదు. దీంతో కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, ఉద్యాన శాఖ అధికారులతో మాట్లాడి మా గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. అలాగే పట్టు పురుగుల పెంపకం చేపట్టే విధానంపై ఉద్యాన అధికారులతో సలహాలు, సూచనలు ఇప్పించారు. –బిబ్బెర తిరుపతి అంబగట్ట
66 కుటుంబాలకు ఆధారం
పట్టు పురుగులు పెంచేందుకు అవకాశం కల్పించిన జిల్లా అధికారులు, ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంట. గ్రామంలోని 66 కుటుంబాలకు ఇదే ఆధారం. పట్టు పురుగులు ఎలా పెంచాలో ఉద్యాన శాఖ అధికారులు చెప్పిన్రు. రెండు నెలల్లోనే మాకు పట్టు కాయలు చేతికి వస్తయ్. వాటిని చెన్నూర్ ఓపెన్ మార్కెట్కు తీసుకెళ్లి విక్రయిస్తం. ఒక్కో కాయకు మూడు నుంచి 4 వరకు ప్రతీ కుటుంబానికి రెండు నెలల్లో సుమారు రూ 40వేల వరకు ఆదాయం లభిస్తుంది. –బిబ్బెర శ్రీనివాస్..(అంబగట్ట)