తలమడుగు, నవంబర్ 3 : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించడానికి మంగళవారం మూడు ట్రెయినీ ఐఏఎస్ బృందం సభ్యులు వచ్చారు. మావల మండలంలోని వాగాపూర్ గ్రామానికి ఐదుగురు, బేల మండలంలోని అవల్పూర్ గ్రామానికి ఐదుగురు, తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామానికి నలుగురు శిక్షణ అధికారులు వచ్చారు. వీరందరూ కూడా ఆయా గ్రామపంచాయతీల్లో ఉంటూ ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధిని, అమలవుతున్న పథకాల తీరును పరిశీలిస్తున్నారు. నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుతూ వివరాలు తెలుసుకుంటున్నారు. కజ్జర్లలో ఉంటున్న నలుగురు అధికారులు రత్నాపూర్, బరంపూర్ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీల వంటివాటిని పరిశీలిస్తూ.. నేరుగా ప్రజలు, పథకాల లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, హరితహారం, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, ఆంగ్ల మాధ్యమం, మధ్యాహ్న భోజనంతోపాటు తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న పథకాలన్నీ బాగున్నాయని ప్రశంసించారు. నేరుగా లబ్ధిదారులకే అందడాన్ని మెచ్చుకున్నారు. మేము దేశంలోని 28 రాష్ర్టాల్లో పర్యటించామని, ఇటువంటి పథకాలు ఎక్కడా కూడా అమలుకావడం లేదని, తెలంగాణ రాష్ట్ర దేశానికే మోడల్గా నిలుస్తున్నదని అభినందించారు.
గుట్టపైకి శుద్ధజలం అందించడం అమోఘం
నా పేరు రాజు(ఐఎఫ్ఎస్). నాది తమిళనాడు రాష్ట్రం. నేను కజ్జర్ల, దేవాపూర్, బరంపూర్ గ్రామాలు తిరుగుతున్న. కజ్జర్లలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహారం గురించి తెలుసుకున్న. రుచి కూడా చూశా. బాగుంది. ఇద్దరు చిన్నారులను ఆల్ఫాబెట్స్ అడుగగా టకాటకా చెప్పారు. చాలా సంతోషనిపించింది. చదువుతోపాటు భోజనం కూడా బాగా పెడుతున్నారని తెలుస్తున్నది. అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలకు వెళ్లా. తెలుగు, ఆంగ్ల మాధ్యమం బోధిస్తున్నారు. చిన్నారులను ప్రశ్నలు అడుగగా మంచిగా సమాధానాలు చెప్పారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన. ఆహారంలో అన్నం, పప్పుతోపాటు ఆకుకూరలు, కూరగాయలతో భోజనం పెడితే బాగుంటుంది. గుట్టపై ఉన్న రత్నాపూర్ గ్రామానికి వెళ్లి గిరిజనులతో మాట్లాడిన. గతంలో తాగునీటి సమస్య ఉండేదని ప్రజలు చెప్పారు. తెలంగాణ సర్కారు మిషన్ భగీరథలో భాగంగా గుట్ట మీదికి పైప్లైన్ వేసి ట్యాంకు ద్వారా నీరందిస్తున్నదని చెప్పారు. ఇంటింటికీ నల్లా నీరు అందుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. అంతకముందు మైళ్ల దూరం నడుచుకుంటూ, వాహనాల ద్వారా నీళ్లు తెచ్చుకునేదని చెప్పారు. ఇప్పుడు మా కష్టాలు తీరాయని చెబుతున్నారు. మారుమూల గ్రామం, అది గుట్టపై ఉన్న గ్రామానికి కూడా శుద్ధజలం అందించడం సంతోషంగా ఉంది.
సాగు పథకాలకు సలాం..
నా పేరు మనెంజేశ్ కుమార్ ఏపీ. నాది కర్ణాటక రాష్ట్రం. ట్రెయినీ ఐఏఎస్ శిక్షణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్లకు వచ్చా. నాతోపాటు ఇంకా ముగ్గురు అధికారులు వచ్చారు. మేము మూడు రోజులుగా కజ్జర్లలో ఉంటూ తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు, అమలవుతున్న తీరును నేరుగా ప్రజలు, లబ్ధిదారుల నుంచి తెలుసుకుంటున్నాం. ఎటువైపు చూసినా చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు నిండుగా ఉంది. పచ్చని పొలాలు, తోటలు కనిపిస్తున్నాయి. రైతులు చేలలో పని చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ఎప్పుడు కూడా కరంటు పోవడం లేదు. మోటార్లు, బోర్లు ఎక్కడా చూసినా దాదాపు నడుస్తూనే కనిపించాయి. అడవులు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇటువంటి అడవులను ఎక్కడా చూడలేదు. ప్రజలను అడుగగా సర్కారు హరితహారంలో భాగంగా మొక్కలు నాటింది. అవి పెరిగి పెద్దవయ్యాయి. అందుకే ఎక్కడా చూసినా పచ్చగా కనిపిస్తున్నాయని తెలిపింది. రైతులతో మాట్లాడగా.. “సీఎం కేసీఆర్ సారు వ్యవసాయానికి ఢోకా లేకుండా చేస్తున్నడు. పెట్టుబడికి పంటకు రూ.5వేల చొప్పున యేడాదికి రూ.10 వేలు ఇస్తున్నడు. అంతకముందు పెట్టుబడి కోసం సానా ఇబ్బంది పడేది. పశువులు, బంగారం అమ్ముకునేది. షావుకార్ల వద్ద డబ్బులు తీసుకచ్చుకుంటే మిత్తికి మిత్తి వేసేశారు. చివరకు పంట అమ్మగా ఏమి మిగిలేది కాదు. కరంటు కూడా ఉచితంగా ఇవ్వడంతో డబ్బులు తప్పాయి. అంతక ముందు ఎప్పుడు పడితే అప్పుడు కరంటు పోయేది. మా సానా మంది కరంటు వేయడానికి వెళ్లి షాక్కు గురై, విషసర్పాలు కుట్టి చనిపోయారు.” అని చెప్పారు. కజ్జర్ల గ్రామానికి చెందిన రైతు పాముల రమేశ్ ఇటీవల గుండెపోటుకు గురై మరణించారు. ఆయన భార్య అమ్రపాలిక ఖాతాలో నేరుగా రూ.5 లక్షలు జమ అయ్యాయి. ఈ డబ్బులతో అమ్రపాలిక ఆమె కూతురును ఉన్నత చదువుతు చదివిస్తానని తెలిపింది.