ఆదిలాబాద్, జూన్ 21 ( నమస్తే తెలంగాణ) : వానాకాలం పంటల సాగు విషయంలో రైతులు తొందర పడొద్దని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి డీ పుల్లయ్య సూచించారు. పత్తి, సోయాబీన్, కంది తదితర పంటలు వేసుకోవడానికి ఇంకా సమయం ఉందని, రెండు, మూడ్రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
నమస్తే తెలంగాణ : వానకాలం సీజన్ ప్రారంభమైనా వర్షాలు పడడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు?
జిల్లా వ్యవసాయ అధికారి : ఈ ఏడాది వానకాలం సీజన్ ప్రారంభమై 15 రోజులు గడిచిపోయాయి. వర్షాలు మాత్రం కురియడం లేదు. జిల్లాలో ఈ సీజన్లో పంటల సాగుకు చాలా సమయం ఉంది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత సంవత్సరం సైతం జూన్ మూడో వారంలో వర్షాలు పడ్డాయి. రెండు, మూడ్రోజుల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు భూమి లో 60 శాతం తేమ ఉంటేనే విత్తనాలు వేయాలి.
పంటలు వేసుకోవడానికి ఎంత సమయం ఉంది?
జిల్లాలో రైతులు వానకాలంలో పత్తి, సోయాబీన్, కంది తదితర పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. పత్తి జూలై చివరి వారం వరకు, సోయాబీన్ జూలై రెండో వారం వరకు, కంది జూలై చివరివారం వరకు వేసుకునే అవకాశాలున్నాయి. పత్తి, కంది పంటల కాలవ్యవధి ఆరు నెలలు, సోయాబీన్ వంద రోజులు ఉంటుంది. ఈ సమయం వరకు విత్తనాలు వేసుకున్నా పంట దిగుబడిలో ఎలాంటి సమస్యలుండవు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సౌకర్యం ఉన్న రైతులు ఇప్పటికే పత్తి పంట వేశారు. మరికొన్ని ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటి వానల కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ సీజన్లో పంటల సాగు విషయంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారా?
జిల్లా వ్యాప్తంగా 101 వ్యవసాయ క్లస్టర్లున్నాయి. ప్రతి క్లస్టర్లో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు పంటల సాగు విషయంలో అవగాహన కల్పిస్తున్నారు. తొందరపడి విత్తనాలు వేయవద్దని, ఇంకా సమయం ఉన్నందున వర్షాలు పడిన తర్వాత పంటల సాగు ప్రారంభించాలని సూచిస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువుల వాడకం, విత్తనశుద్ధి, వరి పంట సాగులో విత్తనాలు వెదజల్లడం లాంటి విషయాలను తెలియజేస్తున్నాం. పంటల సాగు విషయంలో రైతులకు ఎలాంటి సమస్యలున్నా జిల్లా వ్యవసాయశాఖ, మండల వ్యవసాయశాఖ కార్యాలయాల్లో సంప్రదించాలి.
విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
జిల్లాలో ఈ సీజన్లో 5.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనాలు తయారు చేశాం. పత్తి 3.57 లక్షల ఎకరాలు, సోయాబీన్ 1.32, కంది 66 వేల ఎకరాలతో పాటు ఇతర పంటలను రైతులు సాగుచేయనున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలను పంపిణీ చేశాం. నకిలీ విత్తనాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. టాస్క్ఫోర్స్ బృందాలు దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సీజన్లో 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 13 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 7 వేల మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 36 వేల మెట్రిక్ టన్నుల ఎన్పీఎస్కే, 4 వేల మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ అవసరమవుతాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రైతులకు అవసరమైన ఎరువులను నెలల వారీగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నాం.
ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం ఎంతవరకు పెరిగే అవకాశాలున్నాయి?
గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో 40 వేల ఎకరాల్లో సాగువిస్తీర్ణం పెరగనున్నది. గతేడాది పత్తి, కంది పంటల సాగు రైతులకు లాభదాయకంగా మారింది. ఈ ఏడాది సైతం ఈ పంటల సాగు 50 వేల ఎకరాలు పెరిగే అవకాశాలున్నాయి. ఇతర పంటలు రైతులు తగ్గించుకొని ఈ పంటలను వేయనున్నారు. పత్తి, కంది పంటలకు సీజన్లో మంచి ధరలు లభిస్తాయి.