130 ఏండ్ల చరిత్ర.. మూడు కిలోమీటర్ల మేర రాతిగోడ.. నిజాం కాలంలో ఫ్రెంచ్ ఇంజినీర్ల సృజనాత్మకతతో నిర్మించిన అతి సుందర ఆనికట్ సదర్మాట్. చుట్టూ కొండలు, గుట్టలు.. పచ్చందాలతో ఆకట్టుకునే ప్రకృతి రమణీయత.. నీటిని తాకుతున్నట్టుండే నీలాకాశం.. గట్టు నుంచి జాలువారే జలం పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. ఇక్కడే అతిథి గృహం, మినీ పార్కు ఉండడంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి సందర్శకులు వస్తున్నారు.
ఖానాపూర్ టౌన్, ఆగస్టు 4 : ఖానాపూర్ పట్టణానికి ఏడు కిలో మీటర్ల దూరంలో సదర్మాట్ ఆనికట్ ఉంది. 130 ఏండ్ల క్రితం నైజాం కాలంలో గోదావరి మధ్యలో మూడు కిలోమీటర్ల పొడవాటి రాతిగోడతో ప్రెంచ్ ఇంజినీర్ జేజే ఒటాలే రూపకల్పన చేశారు. గోదావరికి వరద వచ్చినప్పుడు ఆనికట్ మ త్తడి గోడపై నుంచి నీరు పరవళ్లు తొక్కుతూ అచ్చం జలపాతాన్ని తలపిస్తున్నది.
ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలు మూలల నుంచి పర్యాటకులు, వివిధ విద్యా సం స్థల విద్యార్థులు వస్తుంటారు. ఇక్కడే వంట చేసుకోని సరదాగా కాలక్షేపం చేస్తారు. అతిథి గృహం, మినీ పార్కు కూడా ఉంది. ఎగువ భాగంలో సదర్మాట్ బ్యారేజీ నిర్మిస్తున్నందున పర్యాటక శాఖకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
నిర్మల్ జిల్లా కేంద్రానికి 41 కిలోమీటర్ల దూరంలో సదర్మాట్ ఆనికట్ ఉంది. ఇక్కడికి త్రీ, ఫోర్ విల్లర్ ద్వారా చేరుకోవచ్చు. ముందుగా నిర్మల్ జిల్లా కేం ద్రం నుంచి 34 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఖానాపూర్ చేరుకోవాలి. అక్కడి నుంచి సుర్జాపూర్, మే డంపెల్లి గ్రామాల మీదుగా ఏడు కిలోమీటర్లు ప్రయాణించి సదర్మాట్కు రావచ్చు.