కొత్తగూడెం సింగరేణి, మే 30 : తెలంగాణ ఆవిర్భావ వేడుకలను సింగరేణిలో అంబరాన్నంటేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సింగరేణీయులు పాల్గొని విజయవంతం చేయాలని జీఎం పర్సనల్ (వెల్ఫేర్, ఆర్సీ) కే బసవయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన ‘నమస్తే’తో మాట్లాడారు. జూన్ 2వ తేదీన ఉదయం హెడ్డాఫీస్లో సింగరేణి డైరెక్టర్ల చేతుల మీదుగా జెండా వందనం ఉంటుందని తెలిపారు. అనంతరం ఎదుట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారన్నారు. ప్రకాశం స్టేడియంలో జరిగే సెంట్రల్ వేడుకల్లో సీఎండీ శ్రీధర్ హాజరవుతారని చెప్పారు. ఉదయం 10:30 గంటలకు ప్రకాశం స్టేడియం నుంచి బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ తీయనున్నట్లు తెలిపారు. అనంతరం స్థూపానికి పూలమాల వేసి, నివాళులర్పిస్తారని చెప్పారు. ఆ తర్వాత ముఖ్య అతిథి తన సందేశాన్ని వినిపిస్తారని, అనంతరం ఉత్తమ సింగరేణి కార్మికులను సన్మానిస్తారని వివరించారు. సాయంత్రం ప్రకాశం మైదానంలో ముగింపు వేడుకలు జరుగుతాయని, ముఖ్య అతిథిగా సీఎండీ శ్రీధర్తో పాటు డైరెక్టర్లు పాల్గొంటారన్నారు. ముఖ్య అతిథి ఉపన్యాసం తర్వాత జబర్దస్త్ కళాకారులతో హాస్యవల్లరి, స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులతో పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
శ్రీరాంపూర్, మే 30 : శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, ఎస్వోటూ జీఎం కే హరినారాయణ గుప్తా, డీవైజీఎం గోవిందరాజుతో కలిసి జీఎం సంజీవరెడ్డి పరిశీలించారు. జీఎం ఆఫీస్ వద్ద ప్రొఫెసర్ జయంశంకర్ సార్ విగ్రహం వద్ద, ప్రగతి స్టేడియంలో, అమర వీరుల స్థూపం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు శాఖల వారీగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైజీఎం శివరావు, సీనియర్ పీవో కాంతారావు పాల్గొన్నారు.