కడెం, మే 28: అటవీ సంపద ద్వారా గిరిజనులు ఉపాధి పొందే అనేక ఉత్పత్తుల్లో ప్రధానమైనది ఇప్పపువ్వు. దీనిని అనువుగా చేసుకొని ఏటా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పపువ్వు సేకరించి ఉపాధి పొందుతుంటారు. ఇప్పపువ్వులో అనేక ఔషధ గుణాలు ఉండడంతో ప్రజలు దానిని వినియోగించడంతో పాటు విక్రయిస్తుంటారు.
ప్రధానంగా మార్చి నుంచి మే వరకు ఇప్ప చెట్లపై నుంచి పువ్వు రాలుతుండడంతో దానిని సేకరించి అమ్ముతుంటారు. ఇప్ప పువ్వును వంటకాలతో పాటు, చర్మ రక్షణకు కూడా వినియోగిస్తుంటారు. ప్రజలు సేకరించిన ఇప్పపువ్వును ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. కడెం మండలంలోని అనేక గ్రామాలు అటవీ ప్రాంతాన్ని అనుకొని ఉండడంతో ఇక్కడి ప్రజలు ప్రతిరోజు వేకువజామునే అడవికి చేరుకుంటున్నారు.
మండలంలోని అల్లంపెల్లి, గంగాపూర్, ఉడుంపూర్, సింగాపూర్, ధర్మాజీపేట, లక్ష్మీపూర్, నవాబుపేట, కల్లెడ, అంబారిపేట, చిట్యాల, మద్దిపడగ, బెల్లాల్, తదితర గ్రామాల్లోని ప్రజలు ఉదయాన్నే అడవికి వెళ్లి చెట్ల కింద రాలిన పువ్వు సేకరిస్తుంటారు. దానిని ఇళ్లలో దాదాపు 15 నుంచి నెల రోజుల పాటు ఎండబెట్టిన అనంతరం విక్రయిస్తారు. కడెం మండలకేంద్రంలోని డీఆర్ డిపోలో ఇప్పపువ్వును గత ఏడాది రూ. 30కి కిలో చొప్పున కొనుగోలు చేశారు.
ఈ ఏడాది కూడా ప్రతి ఆదివారం ఇక్కడి డీఆర్ డిపోలో జీసీసీ (గిరిజన సహకార సంఘం) కొనుగోలు చేస్తున్నది. ఇప్పపువ్వును సబ్బులకు, కొవ్వొత్తుల తయారీతో పాటు ఇతర వస్తువుల తయారీలో ఉపగియోగిస్తుంటారు. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన ఇప్పపువ్వును జీసీసీ కేంద్రానికి తరలిస్తారు. ఇప్పపువ్వుల ద్వారా లడ్డూల తయారీ, ఇతర అవసరాల కోసం జీసీసీ అధికారులు దీనిని వినియోగిస్తుంటారు. అనేక అటవీ గ్రామాల్లోని ప్రజలకు ఇప్పపువ్వు సేకరణ ఉపాధి చూపుతున్నది.మే చివరి వారం కావడంతో ఆయా గ్రామాల్లోని ఈ పువ్వును సేకరించి ఆరబెడుతున్నారు.
వేసవిలో సేకరించిన ఇప్పపువ్వును ప్రతి ఆదివారం కడెం మండల కేంద్రంలోని డీఆర్ డిపో కేంద్రంలో కొనుగోలు చేస్తాం. గదుల కొరత వల్ల కొనుగోలులో కొంత జాప్యమైంది. ప్రజల వద్ద ఉన్న ఇప్పపువ్వును పూర్తిస్థాయిలో సేకరిస్తాం. ఇక్కడి నుంచి ఉట్నూర్ జీసీసీ కార్యాలయానికి తరలిస్తున్నాం. త్వరలోనే కడెం మండలకేంద్రంలోని డీఆర్ డిపో గదులను సిద్ధం చేసి మరింత సేకరిస్తాం.
రషీద్, డీఆర్ డిపో మేనేజర్, కడెం