నిర్మల్ అర్బన్, మే 19 : జిల్లాలో ఇతర రష్ట్రాల మద్యం ఏరులై పారుతున్నది. జిల్లాకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న మహారాష్ట్రతో పాటు గోవా, ఇతర రాష్ర్టాల నుంచి అక్రమార్కులు భారీగా మద్యాన్ని డంప్ చేస్తున్నారు. ఇతర రాష్ర్టాలతో పోల్చితే కొన్ని బ్రాండ్లు మినహా మిగతావి తక్కువ ధరకే ప్రభుత్వం విక్రయిస్తున్నది. అతి తక్కువ రేట్లకు దొరికే కొన్ని బ్రాండ్లపై దృష్టి సారించిన అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా ఇతర రాష్ర్టాల మద్యాన్ని పెద్ద పెద్ద బ్రాండ్లలో కల్తీ చేస్తూ జోరుగా విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి పడుతున్నది. ఇటీవల పెంబిలో రూ.2 లక్షల విలువైన గోవా మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిర్మల్ జిల్లాకు గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్తో పాటు ఇతర రష్ట్రాలకు చెందిన మద్యం సరఫరా అవుతున్నట్లు అనుమానాలున్నాయి. దీనికి తాజా పెంబి ఘటన నిదర్శనంగా నిలిచింది. వ్యాపారులు ఒక ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకొని గోవాలో తక్కువ ధరకు లభించే మద్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి లేబుళ్లు మార్చి అమ్ముతున్నారు. మహారాష్ట్రలో అతి తక్కువకు లభించే మద్యంతో పాటు దేశీదారు దందా జోరుగా సాగుతున్నది. తనిఖీలు తక్కువగా ఉండడం, ఆబ్కారీ శాఖ పట్టించుకోకపోవడంతో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వానికి ట్యాక్స్లు చెల్లించకుండా ఎగ్గొడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా బాటిళ్లపై ఇతర రాష్ర్టాల స్టిక్కర్లు తొలగిస్తూ యథేచ్ఛగా విక్రయిస్తున్నారు.
అక్రమ మద్యం ఆధారాలు వెతికేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు విచారణ వేగవంతం చేశారు. గోవా నుంచి బెజవాడ రాంబాబు పశ్చిమ గోదావరికి తీసుకొచ్చి పెంబికి చెందిన వైన్స్ వ్యక్తులైన ధాత్రిక సురేశ్కు విక్రయిస్తున్నాడని విచారణలో తేలింది. దీంతో బెజవాడ రాంబాబుపై ఏ1 నిందితుడుగా, ధాత్రిక సురేశ్ ఏ2గా, అమాందర్ శివ కృష్ణ ఏ3, సింగు నరేశ్ ఏ4 నిందితులుగా కేసు నమోదు చేశారు. ఎంఎస్ఆర్ వైన్స్పై కేసు నమోదు చేసి షాప్నకు సీల్ వేశారు. షాపు నుంచి రెండు ఐబీ కాబున్లు (180మి.మీ), 6 కాటన్ల ఎంసీ విస్కీ, 6 కాబుల్ల గోల్డ్ డ్రాప్ మద్యాన్ని, 1422 నకిలీ లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఏ1 నిందితుడైన బెజవాడ రాంబాబు పరారీలో ఉన్నాడు. ఇతనికోసం రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు గాలిస్తున్నారు.
జిల్లాలో ఇతర రాష్ర్టాల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ముందస్తు సమాచారం మేరకు పెంబికి వెళ్లి దాడులు నిర్వహించాం. గోవా నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని పట్టుకున్నాం. ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిర్మల్, భైంసా ఎక్సైజ్ పరిధిలోని అన్ని వైన్స్ల్లో నాలుగు ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించాం. ఇతర రాష్ర్టాల మద్యం లభ్యం కాలేదు. దేశీదారు రవాణాపై దృష్టి సారించాం. కల్తీ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– రవీందర్ రాజు, ఇన్చార్జి ఎక్సైజ్ సూపరింటెండెండ్, నిర్మల్