ఆదిలాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ చదువుకుంటున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తోంది. ఉన్నత విద్యతోపాటు, వారు తమ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకునేందుకు ఇంటర్ విద్య కీలకం. జిల్లావ్యాప్తంగా 13 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీతోపాటు ఇతర కోర్సుల్లో ప్రభుత్వం ఉచితంగా విద్య అందిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారు ఉన్నత చదువులు చదువుకోవడంతోపాటు తమ బంగారు భవిష్యత్ కలను సాకారం చేసుకునేందుకు ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ విద్యార్థులకు తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు. జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ చదువుతున్న విద్యార్థులకు ఎంసెట్ అగ్రికల్చర్ సీట్లు సాధించేలా శిక్షణ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. విద్యార్థులకు వివిధ అంశాల్లో పరీక్షలు నిర్వహించి ప్రతిభ కనపర్చిన 100 మంది విద్యార్థులను శిక్షణ కోసం ఎంపిక చేశారు.
ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్ సీట్లు సాధించేలా అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్లో పాత మైనార్టీ గురుకుల స్కూల్ భవనంలో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఉచితంగా భోజన సౌకర్యం, వసతి ఏర్పాటు చేశారు. ఆరు నెలలపాటు వారికి ఇంటర్తోపాటు ఎంసెట్ శిక్షణ ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 5న ప్రారంభమైన కోచింగ్ ఫిబ్రవరి వరకు.. మళ్లీ ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత ఎంసెట్ ఎంట్రన్స్ అయ్యే వరకు కొనసాగుతోంది. రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఇంటర్ తరగతులు.. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఎంసెట్ శిక్షణ ఉంటుంది. రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్ కొనసాగుతాయి. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు వీరికి వివిధ సబ్జెక్టుల్లో శిక్షణ ఇస్తారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ ఎంసెట్ శిక్షణను పర్యవేక్షిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో 91 మంది విద్యార్థులకు 45 రోజులపాటు శిక్షణ ఇచ్చామని, వీరిలో 61 మంది ఎంసెట్లో ర్యాంకులు సంపాదించినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ రాహుల్రాజ్ సహకారంతో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుంటామని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంసెట్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. కళాశాలల్లో వివిధ సబ్జెక్టుల నిపుణులు విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందిస్తున్నారు. ప్రతి వారం పరీక్షలు నిర్వహించి వారికి సలహాలు, సూచనలు అందజేస్తున్నాం. విద్యార్థులు కోచింగ్ను సద్వినియోగం చేసుకుని ఎంసెట్లో అధిక సీట్లు సాధిస్తారు. గతేడాది 20 మంది ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఇతర సీట్లు వచ్చాయి. ఈ శిక్షణ పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు ఉపయోగపడుతుంది.
మాది ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామం. నేను ఆదిలాబాద్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నా. కలెక్టర్ సార్ ఇప్పిస్తున్న ఎంసెట్ శిక్షణ మాలాంటి పేద విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఉపయోగప డుతుంది. ఆరు నెలలపాటు కొనసాగే శిక్షణలో అధ్యాపకులు పలు విషయాలను బాగా బోధిస్తున్నారు. ఏమైనా సందేహాలు ఉంటే వివరంగా చెబుతున్నారు. నేను ఎంసెట్ పరీక్ష రాసి బీఎస్సీ అగ్రికల్చర్ సీటు సాధిస్తా.
మాది ఆదిలాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్. నేను ప్రభుత్వ బాలికల జూని యర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదువుతున్నా. కలెక్టర్ సార్ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఎంసెట్ శిక్షణ చాలా బాగుంది. ఇంటర్ సబ్జెక్టులతో పాటు ఎంసెట్లో విషయాలను బోధిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 25 రోజుల శిక్షణలో పలు అంశాలను నేర్చుకున్నా. ఎంసెట్లో మంచి ర్యాంకు సాధిస్తామనే నమ్మకం ఏర్పడింది. పూర్తిస్థాయిలో కోచింగ్ విజయవంతంగా పూర్తి చేసి అగ్రికల్చర్ కళాశాలలో ప్రవేశం తీసుకుంటా.
నేను ఆదిలాబాద్ జిల్లా బేల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదువుతున్నా. మొదటి సంవత్సరంలో 412 మార్కులు వచ్చాయి. పరీక్ష రాసి ఎంసెట్ శిక్షణకు ఎంపికయ్యా. కోచింగ్ సెంటర్లో భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు బాగా ఉన్నాయి. అధ్యాపకులు మాథ్స్, ఫిజిక్స్, కెమెస్ట్రీ సబ్జెక్టులను బాగా బోధిస్తున్నారు. ప్రతి వారం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కోచింగ్ వల్ల పేద విద్యార్థులు బాగా చదువుకుని ఇంజినీరింగ్లో సీట్లు సంపాదించే అవకాశాలున్నాయి. నేను బీటెక్ మెకానికల్ చేయాలని ఉంది. శిక్షణ వల్ల సీటు తప్పకుండా వస్తుందన్న నమ్మకం ఉంది.