ప్రభుత్వ శాఖల్లో కేంద్రాల ఏర్పాటు
పనిచేసే చోటే ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్
నిర్మల్ జిల్లాలోని పలు కార్యాలయాల్లో అమలు
సత్ఫలితాలు ఇస్తున్న ప్రక్రియ
త్వరలో కుల, మహిళా సంఘాలు, వృద్ధులకు అందించేందుకు కసరత్తు
100 శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న యంత్రాంగం
నిర్మల్ అర్బన్ /నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్ 11 : కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తుండగా, సర్కారు అప్రమత్తమైంది. వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచడంతోపాటు అంతకంటే రెట్టింపు వేగంతో టీకాలు అందిస్తున్నది. ఇప్పటికే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 25 పీహెచ్సీలు, యూపీహెచ్ సీల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, ప్రస్తుతం ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి అక్కడే టీకా ఇస్తున్నది. త్వరలో వృద్ధులు, కుల, మహిళా తదితర సంఘాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇక వీలైనంత త్వరగా లక్ష్యాన్ని పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
జిల్లాలో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఓ వైపు నిబంధనలు కఠినతరం చేస్తూనే మరోవైపు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. ఇప్పటికే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 25 పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో కేంద్రాలు ఏర్పా టు చేసి ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్నది. ఇక నిర్మల్ జిల్లాలో దాదాపు 50కి పైగా శాఖలు ఉన్నాయి. ఆయా శాఖల్లో ఉద్యోగులు, సిబ్బంది పని చేసే చోటనే వ్యాక్సిన్ వేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉద్యోగులు, సిబ్బంది ఇతర ప్రదేశాలకు (పీహెచ్సీలు, దవాఖానలు) వెళ్లకుండా ఉన్న చోటనే టీకాలు ఇస్తున్నది. గతంలో వారికి పని చేసే చోటనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో టీకాను అం దిస్తున్నది. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్డిపోతో పా టు మున్సిపల్ కార్యాలయంలో క్యాంపును ఏర్పాటు చేసి, ఒక్క రోజే 250 మంది ఉద్యోగులు, కార్మికులకు వ్యాక్సిన్ వేసిం ది. ఆదివారం భైంసా ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు, కార్మికులకు టీకా వేశారు. కొందరు ఉదయం విధులకు వచ్చీరాగానే టీకా తీసుకుంటుండగా, మరికొందరు డ్యూటీ దిగి ఇంటికెళ్లే సమయంలో వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం కలెక్టరేట్ కార్యాలయంలోనూ కార్యక్రమం నిర్వహించగా, సుమారు 400 మందికి ఉద్యోగులు టీకా వేసుకున్నారు. ఈ విధానం ఆయా శాఖల్లో సత్ఫలితాలు ఇస్తుండగా, మున్ముందు మిగతా విభాగాల్లోనూ అమలు చేసేందుకు అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు.
త్వరలో కుల, మహిళా సంఘాలు, వృద్ధులకు..
జిల్లాలో మూడు నెలల్లో 100 శాతం టీకాను అందించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. వీలైనంత త్వరాగా లక్ష్యాన్ని పూర్తి చేసి రాష్ట్రస్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఫ్రంట్లైన్ వారియర్, ప్రైవేట్ దవాఖాన సిబ్బంది టీకా వేసుకోగా, దశల వారీగా మిగతా వారికి అందిస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు పై బడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, 45 ఏళ్లుపై బడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతోంది. కళాజాత బృందాలు, ఆరోగ్య సిబ్బంది ద్వారా వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను వివరిస్తూ అపోహలను పూర్తిగా తొలగిస్తున్నారు. జిల్లాలో అత్యంత తక్కువ సమయంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసి ప్రజలందరినీ కరోనా నుంచి రక్షించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం ఇప్పటికే పలువురితో సమీక్ష సమావేశాలను కలెక్టర్ నిర్వహించారు. త్వరలో కుల సంఘాలు, వృద్ధులు, వికలాంగులు, మహిళా సంఘాలు, మీ సేవ ఆపరేటర్లు, నాయీబ్రాహ్మణులు, ఆటో యూనియన్, ఇతర సంఘాల వారికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వ్యాక్సినేషన్ను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 వేల మందికి టీకాను అందించినట్లు అధికారులు తెలిపారు.
పని చేసే చోటే వ్యాక్సిన్ వేసుకున్నా
ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నది. నేను నిర్మల్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తా. ఇక్కడే వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. టీకా కోసం ఎక్కడికి వెళ్లకుండా ఇక్క డే వేయించుకున్నా. నాతో పాటు చాలా మం ది వ్యాక్సిన్ తీసుకున్నరు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది.