ఎదులాపురం, పిబ్రవరి 2 : లబ్ధిదారులకు సకాలంలో పౌష్టికాహారం అందించి, వారి ఆరోగ్య ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో గురువారం జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు వివిధ శాఖల ద్వారా సరఫరా చేస్తున్న పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా సకాలంలో అందేలా సంబందిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించేలా సంక్షేమ అధికారులు చొరవ చూపాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్వో కిరణ్ కుమార్, డీఆర్డీవో కిషన్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీడబ్ల్యూవోలు మిల్కా, కృష్ణవేణి, రాజలింగం, జిల్లా పౌర సరఫరాల కార్పొరేషన్ మేనేజర్ సంధ్యారాణి, భీంపూర్ జడ్పీటీసీ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.