భైంసా, ఏప్రిల్ 25 : అధికారులు పరిసరాలను శుభ్రంగా ఉంచకపోతే చర్యలు తప్పవని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని పలు వార్డుల్లో కలెక్టర్ వరుణ్ రెడ్డి మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకపోవడం, డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యాలయాల్లో కూర్చొని కాలక్షేపం చేస్తున్నారా, పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. వెంటనే బాగు చేయాలని సూచించారు. పది రోజుల వ్యవధిలో పూర్తి స్థాయి లో మార్పు రావాలని ఆదేశించారు. వార్డుల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. ముందుగా సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మన ఊరు- మన బడి పనులను పరిశీలించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పారిశుధ్య సిబ్బంది ఉన్నారు.
దవాఖాన నిర్మాణం వేగవంతం చేయాలి
నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్,25: ప్రభుత్వ దవాఖాన, వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రధాన దవాఖాన, వైద్య కళాశాల నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. ప్రధాన దవాఖానలో నిర్మిస్తున్న 50 పడకల అదనపు గదుల నిర్మాణాన్ని పర్యవేక్షించారు. జూన్ చివరి నాటికి అన్ని బ్లాకుల పనులు పూర్తి చేయాలన్నారు. నిర్మల్ మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. దవాఖానలోని పలు బ్లాకులను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఎప్పటికప్పుడు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ దేవేందర్రెడ్డి, ఎంసీహెచ్ ఇన్చార్జి డాక్టర్ రజినీ, వైద్య సిబ్బంది ఉన్నారు.