నేరడిగొండ, డిసెంబర్ 7 : విద్యార్థుల ఆధార్ నమోదు, సవరణలు ఇక సులభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని విద్యావనరుల కేంద్రాల్లో (ఎమ్మార్సీ) ఆధార్ నమోదు సేవలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ సంఖ్య నమోదు తప్పనిసరి చేశారు. కొందరి ఆధార్లో తప్పులు ఉండడంతో మీ సేవ కేంద్రాలకు పరుగులు తీసేవారు. రోజుల తరబడి ఇబ్బంది పడేవారు. ఇక నుంచి అలా అవస్థలు పడాల్సిన అవసరం లేదు. మండల కేంద్రాల్లోనే ఆధార్కార్డులను సరి చేసుకునే అవకాశం కల్పించారు.
మీ సేవ కేంద్రాల్లో విద్యార్థుల ఆధార్ నమోదు, సవరణలు జాప్యం జరుగుతుండడంతో ఎమ్మార్సీ కార్యాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. నేరడిగొండ మండలంలోని 77 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుతున్నారు. కొద్ది రోజులుగా ఆధార్ అనుసంధానం స్థానిక ఎమ్మార్సీలో నిర్వహించగా, ప్రస్తుతం ఆయా పాఠశాలల్లోకి వెళ్లి విద్యార్థుల ఆధార్ అప్డేట్తో పాటు అనుసంధానం, తప్పొప్పులను సరి చేస్తున్నారు. ప్రతి విద్యార్థి అంగన్వాడీలో చేరినప్పటి నుంచి పదో తరగతి వరకు ఆధార్ సంఖ్యను పాఠశాల పేరులో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ఆధార్ సవరణకు బోనఫైడ్ రాసిస్తే వెంటనే సవరణ చేసి అందజేస్తున్నారు.
వసతి గృహాలు, కస్తూర్బా విద్యాలయాల్లో వేలిముద్రలు హాజరు నమోదు చేస్తున్నారు. ఆధార్ వేలిముద్రలు సరిలేక పోవడంతో హాజరు తీసుకోవడం కష్టంగా మారుతున్నది. ప్రస్తుతం విద్యార్థుల వేలిముద్రలు బయోమెట్రిక్లో రాకపోతే వెంటనే సరి చేయిస్తున్నారు. ఇకపై రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ప్రతి రోజూ 20 నుంచి 30 మంది విద్యార్థుల ఆధార్ నమోదు, సవరణలు చేస్తున్నట్లు కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు.
ఆధార్ నమోదు, సవరణ సేవలు తమకు సమీపంలోకి రావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తీరాయి. ప్రతి విద్యార్థి పేరు,ఆధార్ సంఖ్యతో ఆన్లైన్లో వ్యక్తిగతంగా నమోదు అవుతుంది. దీని ఆధారంగానే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. గురుకులాల్లో వేలిముద్ర హాజరు ఉంటుంది. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-అన్రెడ్డి భూమారెడ్డి, ఎంఈవో, నేరడిగొండ.