ఉట్నూర్ రూరల్, నవంబర్ 23 : ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో బుధవారం విదేశీ బృందం పర్యటించింది. మండలంలోని ఆలిగూడలో చేతన ఆర్గానిక్ డెబెల్లా స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతో గిరిజనులు సాగుచేస్తున్న సేంద్రియ పత్తి పంటను జర్మనీ, జపాన్, నెదర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పత్తి సాగు తీరును తెలుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ అభివృద్ధికి తమవంతు సాయం అందిస్తామని బృందం సభ్యులు పేర్కొన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పత్తి పంటను పరిశీలించారు.
చీడపీడల బెడత, ఖర్చులు, లాభ నష్టాల గురించి తెలుసుకున్నారు. సేంద్రియ సాగువల్ల పంటలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుందని వారు పేర్కొన్నారు. సేంద్రియంగా సాగు చేసిన పంటలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుందన్నారు. రైతులు పండించిన పంటలను తమ సంస్థలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అందుకు ప్రతీ రైతు సేంద్రియ పంటలు సాగుచేసేలా ప్రోత్సహించాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు. అనంతరం వారు గతంలో రైతులకు అందించిన ఆవులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈవో నందకుమార్, రాజగోపాల్, ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎనుక శ్రీకర్, ప్రాజెక్టు మేనేజర్ మహ్మద్ ముజీబ్, సంస్థ ప్రతినిధులు దీప, పోషెట్టి, కవిత, స్వర్ణ, ఫీల్డ్ కోఆర్డినేటర్లు జంగు, నాగోరావు, భీంరావు, శంకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
జిన్నింగ్ మిల్లు పరిశీలన..
ఇంద్రవెల్లి, నవంబర్ 23 : మండలంలోని ఏమాయికుంట గ్రామపంచాయతీ పరిధి మిథల్ జిన్నింగ్ మిల్లును చేతన ఆర్గానిక్ డెబెల్లా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జపాన్, ఫ్రాన్స్, నెదర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది. జిన్నింగ్లోని వివిధ రకాల యంత్రాలతోపాటు, పత్తి, పత్తి గింజల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీలో రైతులు సాగు చేస్తున్న వ్యవసాయంతోపాటు సెంద్రియ ఎరువుల వాడకంపై వారికి స్వచ్ఛంద సంస్థ సిబ్బంది వివరించారు.
పంటలు పండిస్తున్న రైతులకు విత్తనాలతోపాటు, మందులు, ఎరువులు అందించనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించి, పంట కొనుగోలు చేస్తామని వివరించారు. విదేశీయులు మైకెల్ కెస్టిన్, జోహన్ కోర్నెలైస్, సమోన్బార్థోలోమెస్, జాన్లామి, అడ్రికిర్స్టెన్, కాల్కోవెన్, రికార్థచోన్, సెలాస్థియన్డౌమి, సౌరవ్లాల్, నికోలస్జోయిన్స్, ఎరిక్లిసాజ్, చేతన ఆర్గానిక్ డెబెల్లా స్వచ్ఛంద సంస్థ మేనేజర్ ప్రభాకర్, సంస్థ సభ్యులు సునీల్, ఆనంద్రావ్ పాల్గొన్నారు.