కాసిపేట, నవంబర్ 28 : మారుమూల గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాసిపేట మండలంలోని వెంకటాపూర్లో దేవాపూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రామగుండం సీపీతో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. అనంతరం ఆదివాసీ గిరిజనులకు దుప్పట్లను పంపిణీ చేశారు. మంచిర్యాల మెడిలైఫ్ దవాఖానలోని ప్రత్యేక వైద్య నిపుణలతో గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్, ఈసీజీ, అన్ని రకాల టెస్టులు చేసి రోగాన్ని నిర్ధారణ చేసి మందులను అందజేశారు. సుమారు 4 వేల మంది శిబిరానికి తరలివచ్చారు. వారికి భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలంతా ఎలాంటి విభేదాలు లేకుండా స్పేహపూర్వకంగా మెలగాలన్నారు. ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలన్నారు. అనంతరం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ గతంలో గ్రామాల్లో బూట్ల చప్పుళ్లు, లాఠీ దెబ్బలతోనే గడిపారని, ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఉండేవని తెలిపారు. పోలీసులంటే భయం ఉండేదని, కానీ ఇప్పుడు పోలీసులు మారుమూల గ్రామీణులకు సైతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గతంలో క్రైం జరిగితే నేరస్తులను పట్టుకునేందుకు ఆలస్యమయ్యేదని, 24 గంటల్లోనే పట్టుకునే వ్యవస్థ అమలులోకి వచ్చిందని తెలిపారు. సేవా కార్యక్రమాలు చేపట్టడంపై పోలీస్ శాఖ అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శరత్ చంద్ర పవార్, బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్, సీఐ ప్రమోద్ రావు, దేవాపూర్ ఎస్ఐ విజయేందర్, ఓరియంట్ కంపెనీ ప్రెసిడెంట్ ఎస్కే పాండే, మెడిలైఫ్ వైద్యులు కుమార్, చేతన్, సిరిపురం శ్రీనివాస్, స్వప్నిక, బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, సర్పంచ్లు ఆడె సౌందర్య, సపాట్ శంకర్, ఆడె జంగు, ముత్యాల స్వప్న, పెంద్రం రాజు, అప్పని స్వరూప, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులారెడ్డి, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.