పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
పల్లె ప్రకృతి వనాల్లో అన్ని రకాల మొక్కల పెంపకం
ఇంద్రవెల్లి, నవంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ప్రత్యేక నిధులతో పంచాయతీల్లో సౌకర్యాలు మెరుగవుతున్నాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో అన్ని రకాల మొక్కలు నాటి పెంచుతుండడంతో హరితవనాలను తలపిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి జాడలేని గ్రామాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తున్నాయి. మండలంలోని మర్కగూడ, హర్కాపూ ర్ఆంధ్గూడ, భిక్కుతండా గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాయి. ఈజీఎస్ ద్వారా రూ.10 లక్షలు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.13లక్షలతో శ్మశాన వాటికలు, రూ. 2 లక్షలతో కంపోస్ట్ షెడ్డు నిర్మించారు. గ్రామాల్లో సేకరించిన తడి-పొడి చెత్త వేసేందుకు రూ.70వేల నుంచి రూ. 80 వేలతో డంప్యార్డులు నిర్మించారు. మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6.84 లక్షలతో ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి 4 వేల చొప్పున వివిధ రకాల మొక్కలు నాటి పెంచుతున్నారు. రూ.5 .17 లక్షలతో 30 గుంట ల స్థలంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి 3 వేల చొప్పున వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. రూ.4.37 లక్షలతో 20 గుంటల భూమి లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి అందులో 2 వేల చొప్పున వివిధ మొక్కలు పెంచుతున్నారు. పల్లె ప్రకృతి వనాలతో పాటు నాటిన మొక్కల పెంపకం కోసం ఒక వాచ్మెన్ను నియమించి పర్యవేక్షణ చేపడుతున్నారు.
పంచాయతీ నిధులతో పనులు
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు మంజూరు చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. పల్లె ప్రకృతి వనంలో 2 వేల మొక్కలు నాటి పెంచుతున్నాం. రూ.13 లక్షలతో శ్మశానవాటిక నిర్మించాం.రూ. 2.50 లక్షలతో కంపోస్ట్ షెడ్డు నిర్మించి అందులో అన్ని రకాల వస్తువులను వేర్వేరుగా ఉంచుతున్నాం. రూ.70 వేలతో డంప్ యార్డు ఏర్పాటు చేసి అందులో చెత్త వేస్తున్నాం. పంచాయతీ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం.
కొడప భీంరావ్, సర్పంచ్, మర్కగూడ
మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు
పల్లె ప్రకృతి వనంలో నాటిన వివిధ రకాల మొక్కలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పల్లె ప్రకృతి వనం రక్షణ కోసం పంచాయతీ ఆధ్వర్యంలో నియమించారు. మొక్కలకు ప్రతి రోజూ నీరుపోస్తూ కాపాడుతున్నం. ప్రకృతి వనంలోకి పశువులు రాకుండా చుట్టు కంచెలు ఏర్పాటు చేశాం. సర్పంచ్ భీంరావ్ ప్రతి రోజూ ప్రకృతి వనంతో పాటు మొక్కలను పర్యవేక్షిస్తారు.
తుల్జాపురే దత్తా , వాచ్మెన్, మర్కగూడ