మద్దతు ధరతో అన్నదాతకు ప్రయోజనం
ముమ్మరంగా వడ్ల సేకరణ
ఉట్నూర్ రూరల్, నవంబర్ 28: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు లబ్ధి చేకూర్చేందుకు చర్యలు చేపట్టింది. పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు పథకం ప్రవేశ పెట్టింది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందిస్తున్నది. అలాగే రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్నది. ఐకేపీ మహిళా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల వ్యవస్థ లేకుండా చేసింది. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి రూ.1960, బీ గ్రేడ్ రకానికి రూ. 1940 రైతులకు ధర చెల్లిస్తున్నది. ధాన్యం తూకం వేసిన వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ధాన్యంలో తేమ 17 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తేమ శాతం తక్కువగా ఉంటే కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వెంటనే తూకం వేస్తున్నారు. మండలంలోని ఉట్నూర్లో 500, లక్కారంలో 50, గంగన్నపేటలో 700, దంతన్పల్లిలో 600, బీర్సాయిపేటలో 400, మొత్తం 2350 ఎకరాల్లో వరి సాగవుతుంది. రైతులకు అందుబాటులో ఉండేవిధంగా వారి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో ధాన్యం తరలింపునకు రవాణా ఖర్చు తగ్గిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు క్వింటాల్కు రూ.100కు తగ్గడంతో కొనుగోలు కేంద్రాలు ఎప్పటికీ కొనసాగించాలని రైతులు పేర్కొంటున్నారు.
ఇబ్బందుల్లేకుండా కొనుగోలు
కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు చేపడుతున్నాం. తేమ శాతం తక్కువగా ఉంటే వెంటనే తూకం వేస్తున్నాం. రైతులు ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా జిరాక్స్ వెంట తీసుకొని రావాలి.
-కాంపెల్లి లక్ష్మి, మహిళా సంఘం సభ్యురాలు