ఓటరు నమోదుపై కార్యక్రమాలు నిర్వహించాలి
ఓటరు జాబితా పరిశీలకుడు, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి కార్యదర్శి సుదర్శన్ రెడ్డి
ఆదిలాబాద్ కలెక్టర్తో కలిసి ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమావేశం
ఎదులాపురం, నవంబర్ 27 : ఓటరు నమోదుపై మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి అర్హుల పేర్లను వందశాతం నమోదు చేయాలని ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు ఓటరు జాబితా పరిశీలకుడు, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి కార్యదర్శి సీ సుదర్శన్ రెడ్డి సూచించారు. ముందుగా శనివారం జిల్లాకు వచ్చిన పరిశీలకుడికి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తాపట్నాయక్ పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్తో కలిసి ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారందరి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసేలా విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆన్లైన్ ఎన్రోల్మెంట్ విధానంతో ఓటరు నమోదును వారి ఇంటి ముందే నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 40 శాతం పూర్తయ్యిందని, ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం 90 శాతం పూర్తికావాలన్నారు. బూత్స్థాయి అధికారులు వారి పరిధిలోని ఓటర్లను గుర్తించి నమోదుచేసేలా చేయడం సంతృప్తికరంగా ఉన్నదని పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారులుగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు సకాలంలో రెమ్యునరేషన్ అందేలా చూడాలని సూచించారు. జిల్లాలో అవగాహన కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయని, స్వీప్ కోర్ కమిటీ టీమ్ను ఆయన అభినందించారు.
తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో ఓటరు నమోదు ఫారాలను పరిశీలించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో సెప్టెంబర్ నుంచి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా, సమావేశాల సందర్భంగా ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కరోనా కారణంగా రెండేళ్లు అవగాహన, నమోదు కార్యక్రమాలు నిర్వహించలేకపోయామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం 90 శాతం నమోదు చేసేందుకు కార్యాచరణతో ముందుకెళ్తామన్నారు. ఇప్పటివరకు 3,428 ఫారం-6, 1,799 ఫారం-7, 258 ఫారం-8, 166 ఫారం-8ఏ లు వచ్చినట్లు వెల్లడించారు. వాటిని పరిశీలించి ఆయా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆ తర్వాత నోడల్ ప్రత్యేకాధికారి, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. జిల్లాలోని 14 మండల కేంద్రాల్లో 582 బూత్స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అలాగే జిల్లాలోని 25 డిగ్రీ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటర్లుగా నమోదు చేస్తున్నట్లు చెప్పారు. 23 జూనియర్ కళాశాలల్లో భవిష్యత్ ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
గరుడ యాప్పై అవగాహన కల్పించి వందశాతం నమోదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి ముందుగా స్థానిక పురుషుల డిగ్రీ, డైట్ కళాశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పోలీస్ లైన్లలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని, వివిధ ఫారాలు, రిజిస్టర్లను రోల్ అబ్జర్వర్ పరిశీలించారు. బూత్స్థాయి అధికారులతో మాట్లాడారు. కాగా, తమకు రెమ్యునరేషన్ సరిగా రావడం లేదని బూత్స్థాయి అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ఐటీడీఏ పీవో అంకిత్, ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, నాయబ్ తహసీల్దార్ శ్రీవాణి, సాయి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.