కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం
పోలింగ్ కేంద్రాలు తనిఖీ
నార్నూర్, నవంబర్ 27 : ఓటరు జాబితా నమోదు వేగవంతం చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం రెవెన్యూ అధికారులకు సూచించారు. మండలంలోని మాన్కాపూర్, నార్నూర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఓటరు నమోదు తీరును పరిశీలించారు. అనంతరం తహసీల్ కార్యాలయంలో ఓటరు ఫారాలను పరిశీలిస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల చివరి వరకు ఓటరు జాబితా నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. 18ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు కార్డులో తప్పలుంటే సవరించుకోవాలని సూచించారు. సమాచారం కోసం హెల్ప్లైన్ 1950ని సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట ఆసిఫాబాద్ ఆర్డీవో దత్తు, నార్నూర్ తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్, డిప్యూటీ తహసీల్దార్ అమృత్లాల్, ఆర్ఐ రాథోడ్ కవిత, సిబ్బంది ఉన్నారు.
ఆదిమ్యాన్లో..
నార్నూర్, నవంబర్ 27 : గాదిగూడ మండలం ఆదిమ్యాన్ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్ తనిఖీ చేశారు. ఓటరు జాబితా నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా త్వరగా పూర్తి చేసి నివేదించాలని తహసీల్దార్ ఆర్కా మోతీరాంను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో దత్తు, డిప్యూటీ తహసీల్దార్ కనక యాదవ్రావ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
బోథ్, నవంబర్ 27: 2022 జనవరి 1వ తేదీలోగా 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ ప్రకాశ్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ సూరజ్రావు సూచించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజుల పాటు 49 కేంద్రాల్లో బీఎల్వోలు దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఫాం-6, 7, 8, 8ఏలతో మొదటి రోజున పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు సునీత, దశరథ్, వీఆర్ఏలు, బీఎల్వోలు పాల్గొన్నారు.