ఆదిలాబాద్ మార్కెట్లో రైతుల ఆందోళన
యార్డు ఎదుట, జాతీయ రహదారిపై బైఠాయింపు
6 గంటల పాటు నిలిచిన కొనుగోళ్లు
తాంసి, నవంబర్ 27: ఆదిలాబాద్ మార్కెట్యార్డులో అన్నదాతలు ఆందోళనకు దిగారు. వ్యాపారులు ఒక్క రోజులోనే పత్తిధర క్వింటాలుకు రూ.160 తగ్గించడంపై భగ్గుమన్నారు. మిగతా మార్కెట్లలో ధర ఎక్కువగా ఉండగా, కేవలం ఆదిలాబాద్ మార్కెట్లో వ్యాపారులు కుమ్మక్కై రైతులను నట్టేటా ముంచుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం చెల్లించిన ధర ప్రకారం పత్తి కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేసిన అన్నదాతలు పత్తి బండ్లను ఎక్కడిక్కడే నిలిపి యార్డు ఎదుట, పంజాబ్ చౌక్లోని జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. సుమారు 6 గంటల పాటు కొనుగోళ్లు నిలిచాయి. ఎట్టకేలకు క్వింటాలుకు రూ.8వేలు చెల్లించి కొనుగోలు చేయడానికి వ్యాపారులు సిద్ధం కావడంతో ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి.
ఒకేసారి రూ.160 తగ్గింపు…
జిల్లాలో కొన్ని రోజులుగా పత్తిధర పెరుగుతూ వస్తున్నది. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం క్వింటాలుకు పత్తి రూ.8130 పలికింది. దీంతో అన్నదాతలు శనివారం పెద్దసంఖ్యలో వాహనాల్లో పత్తిని మార్కెట్కు తీసుకువచ్చారు. దీంతో ఉదయం వేలం పాటలో వ్యాపారులు క్వింటాలకు రూ.7960గా నిర్ధారించారు. దీంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ధరకు పత్తిని అమ్మే ప్రసక్తి లేదని రైతులు ఆందోళన బాటపట్టారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో మార్కెట్తో పాటు తాంసి బస్టాండ్ వరకు వాహనాలు నిలిచిచాయి. అన్నదాతలు మొదట మార్కెట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కిసాన్చౌక్లోని జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు విశ్రమించేది లేదని అన్నదాతలు ఆందోళన నిర్వహించారు.
వ్యాపారులతో మాట్లాడిన అడిషనల్ కలెక్టర్…
రైతులు ఆందోళన చేస్తున్న విషయం జిల్లా మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్ ఉన్నతాధికారులకు తెలియజేయడంతో అడిషనల్ కలెక్టర్ నటరాజన్ రంగంలోకి దిగారు. మధ్యాహ్నం మార్కెట్ యార్డుకు చేరుకొని రైతులతో మాట్లాడారు. అనంతరం వ్యాపారులతో కూడా మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించారు. శుక్రవారం చెల్లించిన ధర ప్రకారం కొనుగోలు చేయాలని పట్టుబట్టారు. వ్యాపారులు రూ.8వేలకు మంచి కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. వ్యాపారులు, రైతులతో చాలాసేపు మాట్లాడి అడిషనల్ కలెక్టర్ నటరాజన్ రూ.8వేలకు క్వింటాలు కొనుగోలు చేసేలా చూశారు. దీంతో మధ్యాహ్నం 3గంటల తర్వాత పత్తికొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి.