ఉమ్మడి జిల్లాలో 200 స్కూళ్ల ఎంపిక
పాఠశాలల్లో ‘సైబర్ కాంగ్రెస్’ నిర్వహణ
షీటీం, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ
నిర్మల్ అర్బన్/ ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 26;సైబర్ నేరాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ముందస్తు అప్రమత్తతలో భాగంగా పాఠశాల స్థాయిలో వారికి శిక్షణనందిస్తే, తల్లిదండ్రులకూ ప్రయోజనకరంగా మారుతుందని భావిస్తున్నది. ఇందుకు పోలీస్శాఖతో సమన్వయం చేసుకుంటూ ఈ తరగతులను ఏర్పాటు చేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తొలుత 200 స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుండగా, ఇంటర్నెట్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆన్లైన్ లింకులు, తదితరాలపై వివరిస్తున్నది.
ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్ల వలలో లక్షలు పోగొట్టుకున్నారని వార్తలు నిత్యం వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అత్యాశ… నిరక్షరాస్యత.. రోజు రోజుకూ పెరిగిన ఇంటర్నెట్ వాడకం కూడా ఓ కారణమైంది. బ్యాంకు, బీమా కంపెనీల నుంచి అంటూ ఫేక్ మెయిల్స్, కాల్స్ ద్వారా ఏదో ఒక రూపంలో సాధారణ ప్రజలను దోచుకుంటున్నారు. ఇవే కాకుండా మహిళలను వివిధ రకాలుగా వేధిస్తున్నారు. బాధితులుగా మారడానికి ప్రధాన కారణం ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడమే. దీనిని గుర్తించిన ప్రభుత్వం పాఠశాల దశ నుంచే విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి, వాటికి అడ్డుకట్ట వేయాలని ప్రత్యేక అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘సైబర్ కాంగ్రెస్’ పేరిట పాఠశాలల్లో కార్యక్రమాలు చేపట్టింది. విద్యాశాఖ, పోలీస్ శాఖ, యంగిస్థాన్ ఫౌండేషన్ సాయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఆయా ప్రాంతాల ఎస్ఐలు, షీటీం సభ్యులు విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
ప్రతి పాఠశాల నుంచి ఇద్దరి ఎంపిక
ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థులకు ఆన్లైన్లో జూమ్ మీటింగ్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో ఇద్దరు విద్యార్థులతో పాటు ఒక ఉపాధ్యాయురాలు పాల్గొంటారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయురాలిని ‘మెంటర్’గా, విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా పిలుస్తారు. ప్రతి పాఠశాల నుంచి 8,9,10 తరగతి చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయిలో వర్చువల్ వెబ్నార్ ద్వారా సైబర్ నేరాలపై నేర్చుకున్న అంశాలను సైబర్ అంబాసిడర్లు (విద్యార్థులు) తోటి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా వివరిస్తున్నారు. తమతో పాటు తల్లిదండ్రులను అప్రమత్తం చేసేందుకు ఈ శిక్షణ ఉపయోగపడనుంది.
నేరాలపై అవగాహన కల్పిస్తాం..
ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మంది లావాదేవీలను ఆన్లైన్లోనే చేస్తున్నరు. ఇలాంటి సమయంలో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలపై వల విసిరి అందినకాడికి దోచుకుంటున్నరు. ఇలాంటివి జరగకుండా పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తే, తల్లిదండ్రులకూ ఎంతో ఉపయోగపడుతుంది. పెద్దయ్యాక మేమూ మోసపోకుండా ఈ శిక్షణ దోహదం చేస్తుంది.
-అంజలి, సైబర్ అంబాసిడర్ చాంది(టి)
డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలి
సైబర్ నేరాలను పూర్తిగా అణగదొక్కడానికి పోలీసు శాఖ ఆది నుంచే అడుగులు వేస్తున్నది. సైబర్ మోసా లపై విద్యార్థి దశ నుంచే అవగా హన కల్పిస్తే మోసాలను పూర్తిగా నివారించ వచ్చు. ఆఫర్లు, లక్కీడ్రాలపై అత్యా శ వద్దు. ఏటీఎం, పాన్ కార్డు మార్చుతా మని వచ్చే ఫేక్ కాల్స్కు రెస్పాండ్ కావద్దు. మీ ఏటీఎం కార్డు నంబర్ను అపరిచిత వ్యక్తులకు తెలియనీయ కూడదు. మీకు తెలియకుండా బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైనట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.
-చల్లా ప్రవీణ్ కుమార్. నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ
సైబర్ నేరాలనియంత్రణ కోసమే…
సమాజంలో సైబర్ నేరాలను అదుపులో ఉంచడానికే సైబర్ కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే సైబర్ దోపిడీకి గురి కాకుండా అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకు పోలీస్ శాఖ నుంచి మా వంతుగా సహకరిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నుంచి 50 పాఠశాలలను ఎంపిక చేసి, ఈ ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులను ఎంపిక చేసి సైబర్ క్రైంలపై అవగాహన కల్పిస్తున్నాం.